చేపల పులుసు కన్నా చేపల ఇగురు చాలా రుచిగా ఉంటుంది. కానీ చాలా తక్కువ మందికి చేపల ఇగురు చేయడం వస్తుంది. వేడి వేడి అన్నంలో ఇగురు వేసుకుని తింటే ఆ రుచే వేరు. చేపల ఇగురు సులువుగా ఎలా చేయాలో ఇక్కడ చెప్పాం. 


కావాల్సిన పదార్థాలు
చిన్న చేపలు - ఒక కిలో
అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - రెండు
పచ్చిమిర్చి - రెండు
కారం - మూడు టీస్పూన్లు
కరివేపాకులు - రెండు రెమ్మలు
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - మూడు స్పూన్లు
ఆవాలు - ఒక టీస్పూను
ధనియాల పొడి - ఒక టీస్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
టమోటా గుజ్జు - అర కప్పు
జీలకర్ర - అర స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
గరం మసాలా - ఒక స్పూను


తయారీ ఇలా
1. చేపలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చేపలు పసుపు,ఉప్పు కలిపి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. 
2. ఒక కళాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. అందులో పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
3. ఉల్లిపాయల తరుగు వేసి నూనెలో వేయించాలి. బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. 
4. బాగా వేగాక టమోటా ప్యూరీ కూడా వేసి వేయించాలి. అందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. 
5. ఇగురులా అయ్యాక అందులో కాస్త నీళ్లు పోసుకోవాలి. గరం మసాలా వేసి కలపాలి. 
6. ఆ ఇగురులో చేపలు వేయాలి. 
7. మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. 
8. మధ్యలో చేప ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. 
9. చేపలు ఉడికాక స్టవ్ కట్టేయాలి. 
10. పైన కొత్తిమీర చల్లుకోవాలి. 


మాంసాహారంలో ఆరోగ్యకరమైనవి చేపలు. వారానికి కనీసం ఒక్కసారైనా తింటే ఎంతో ఆరోగ్యం. ఇందులో మంచి కొవ్వులు, పోషకాలు అనేకం ఉంటాయి. చేపలు తినడం వల్ల మెదడుకు చాలా మేలు చేస్తుంది. చురుగ్గా పనిచేస్తుంది. మానసిక ఆందోళన బాధపడేవారు చేపలు తినడం వల్ల మంచిది. గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు రాకుండా కూడా చేపల్లోని పోషకాలు అడ్డుకుంటాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడం కూడా చేపల వల్ల అవుతుంది. ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తంలో ట్రైగ్లిజరైడ్లు చేరకుండా ఉంటాయి. దీని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు రాకుండా ఉంటాయి. చేపలు తినడం వల్ల డోపమైన్, సెరోటోనిన్లు విడుదలవుతాయి. ఇవి మూడ్ ను చురుగ్గా మారుస్తాయి. కీళ్ల నొప్పులు రాకుండా కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అడ్డుకుంటాయి. స్త్రీలలో రుతుక్రమం సరిగా రావాలంటే తరచూ చేపలు తింటూ ఉండాలి. చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒకట్రెండు సార్లు తినడం అలవాటు చేసుకోవాలి.


Also read: అరుదైన మౌలిక నీలం పసుపు - మనదేశంలో అంతరించిపోతున్న ఔషధం ఇది