మిస్ యూనివర్స్ చరిత్రలో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు పెళ్లి కాని యువతులకే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. కానీ మిస్ యూనివర్స్ 2023 పోటీ నుంచి వివాహిత స్త్రీలు, పిల్లల తల్లులు కూడా ప్రపంచసుందరి కిరీటానికి అర్హులే. ఫాక్స్ న్యూస్ చెప్పిన ప్రకారం మిస్ యూనివర్స్ అర్హత ప్రమాణాల్లో మార్పులు చేశారు. ఇకపై పోటీదారుల వైవాహిక స్థితిపై ఎలాంటి ఆంక్షలు లేవు. వారు అవివాహితులుగా ఉండాలన్న నిబంధన లేదు. ఈ మార్పులను ఎంతో మంది స్వాగతించారు. మిస్ యూనివర్స్ 2020 విజేత అయిన మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజారూల్ మాట్లాడుతూ ‘ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఈ మార్పును నేను నిండు మనసుతో ప్రశంసిస్తున్నాను’ అంది. మిస్ యూనివర్స్ గా ఎంపికైన విజేత ఏడాది పాటూ వారు గర్భం దాల్చకుండా ఉండాలి.  అందుకే అవివాహితులకే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని ఇంతవరకు కల్పించారు. 


దేశాల్లోనూ మారాల్సిందే...
మిస్ యూనివర్స్ నిబంధనలు మారడంతో ఇప్పుడు దేశాల్లోని స్థానిక అందాల పోటీల నిబంధనలు కూడా మార్చాల్సి రావచ్చు. ఎందుకంటే ప్రతి దేశం నుంచి ఒకరు మిస్ యూనివర్స్ పోటీలకు వెళతారు. ఈ పోటీలను దాదాపు 160కి పైగా దేశాల్లోని ప్రజలు ఆసక్తితో చూస్తారు. మిస్ యూనివర్స్ పోటీకి వెళ్లాలంటే ముందుగా ఒక దేశంలో అందాల రాణిగా గెలవాలి. ఉదాహరణకు మనదేశంలో మిస్ ఇండియాగా గెలిచిన వ్యక్తి  మిస్ యూనివర్స్ పోటీలకు తన దేశం తరుపున పాల్గొంటారు.  మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉన్న స్థానిక మోడలింగ్ సంస్థలతో అనుసంధానమవుతాయి. మనదేశంలో ఫెమీనా ఈ బాధ్యతను నిర్వర్తిస్తోంది. అంటే ఫ్రాంచైజీని ఫెమీనా తీసుకుంది. ప్రతి దేశంలోను  మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సంస్థలు జాతీయస్థాయిలో అందాల పోటీని నిర్వహిస్తాయి. ఆ పోటీలో గెలుపొందిన విజేతను అంతర్జాతీయ స్థాయికి పంపిస్తాయి. 


ఇకపై మిస్ ఇండియా పోటీల్లోనూ మార్పులు చేస్తారేమో అని చర్చించుకుంటున్నారు మోడలింగ్ రంగం నిపుణులు. పెళ్లయిన వారు పాల్గొనవచ్చని మిస్ యూనివర్స్ నిబంధనలు మారాయి కాబట్టి, దేశాల్లోని వారు కూడా వివాహితులకు అవకాశం కల్పిస్తారేమో అని ఆశిస్తున్నారు. 


తొలిసారి మిస్ యూనివర్స్ పోటీలు 1952లో జరిగాయి. అప్పుడు ఫిన్లాండ్  కు చెందిన అర్మి కూసెలా మిస్ యూనివర్స్ గా నిలిచింది. ఈ పోటీలను బ్రిటన్ కు చెందిన ‘పసిఫిక్ మిల్స్’ అనే దుస్తుల సంస్థ ప్రారంభించింది. దీన్ని కొన్నాళ్లకు ‘మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్’గా మార్చారు. ప్రస్తుతం దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది. మనదేశం నుంచి తొలిసారి ఈ టైటిల్‌ను 1994లో సుస్మితా సేన్ గెలుచుకుంది. తరువాత 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు గెలిచారు. 


Also read: టిఫిన్ వండుకుని తినే సమయం లేదా? కనీసం వీటినైనా తినండి, లోబీపీ రాకుండా ఉంటుంది


Also read: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే