ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్‌ను భారత యువ ఆటగాడు ప్రజ్ఞానంద వరుస గేమ్స్‌లో ఓడించాడు. మియామీలో జరుగుతున్న ఎఫ్ టీ ఎక్స్ క్రిప్టో కప్‌లో భాగంగా బ్లిట్జ్ ప్లే ఆఫ్ రౌండులో వరుసగా ఓడించాడు. వీరిద్దరి మధ్య మొత్తం 6 గేమ్స్ జరగ్గా.. ప్రజ్ఞానంద 3 గేమ్స్, కార్ల్ సన్ ఒకదానిలో విజయం సాధించాడు. తొలి 2 గేమ్స్ డ్రాగా ముగిశాయి. ఈ టోర్నీలో అత్యధికంగా 16 పాయింట్లు సాధించిన మాగ్నస్ విజేతగా నిలవగా.. 15 పాయింట్లతో ప్రజ్ఞానంద రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. 


వరుసగా 4 విజయాలు


ఈ టోర్నమెంటును ప్రజ్ఞానంద వరుసగా 4 విజయాలతో ప్రారంభించాడు. ప్రపంచ ఆరో ర్యాంకు క్రీడాకారుడు లెవాన్ అర్నోయాన్ ను 3-1 తేడాతో ఓడించాడు. ఒక దశలో కార్ల్ సన్ తో కలిసి అగ్రస్థానంలో కొనసాగాడు. చైనా ఆటగాడు క్యూయాంగ్ లెయిమ్ లీ చేతిలో ఓటమి ప్రజ్ఞానంద విజయంపై ప్రభావం చూపింది. ఆ తర్వాత పోలాండ్ కు చెందిన జాన్ కే. డుడా చేతిలోనూ ఓడిపోయాడు. 


కార్ల్ సన్ కు షాక్


కార్ల్ సన్ తో జరిగిన నాలుగు గేముల రౌండులో తొలి రెండు డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. మూడో గేములో ఓడిపోయాడు. కీలకమైన నాలుగో గేములో పుంజుకుని విజయం సాధించి.. మ్యాచును టై బ్రేక్ కు తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన రెండు గేముల్లోనూ గెలిచి కార్ల్ సన్ కు షాకిచ్చాడు.