ర్షాలు దంచి కొడుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయి. అవే ఇప్పుడు.. దోమలకు ఆవాసాలుగా మారనున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ దోమలు గుడ్లు పెట్టేందుకు ఇదే సరైన సమయం. నిలిచిన నీరు, అధిక తేమ ఏడిస్ దోమ వృద్ధికి కారణమవుతాయి. మరి, మనం వాటికి ఆ అవకాశం కల్పించకూడదంటే.. మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిలబడకుండా జాగ్రత్తపడండి. ఇంట్లో కూడా ఎక్కడా నీరు నిలువ ఉంచకూడదు. ఎందుకంటే.. కాలం మారుతోన్న కొద్ది డెంగ్యూ కూడా ముదురుతోంది. మరింత ప్రమాదకరంగా మారుతోంది.డాక్టర్లు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. తాజాగా డాక్టర్లు చెప్పిన కొన్ని విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.


డెంగ్యూ వస్తే జ్వరం వస్తుంది. అది ముదిరితే.. రక్తంలో క్రమేనా ప్లేట్‌లెట్స్ పడిపోవడం మొదలవుతుంది. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ కానట్లయితే.. ప్రాణాలకే ముప్పు. అయితే, ఈ వైరల్ ఫీవర్ మనకు తెలియకుండానే మరో నష్టాన్ని కలిగిస్తోంది. నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప ప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంగ్యూ సాధారణ ఫ్లూ లక్షణాలను కలిగి ఉన్నా.. అది నాడీ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఎన్సెఫాలిటిస్, మెనింజైటిస్, మైలిటిస్.. మెదడు, వెన్నుపాము వాపుకు కారణమవుతాయి. ఫలితంగా డెంగ్యూ రోగులు తరచు తలనొప్పితో బాధపడతారు. అలాగే వారి మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి. కొందరు కోమాలోకి జారుకోవచ్చు.


నేరుగా మెదడు, నాడి వ్యవస్థపై దాడి?


వైరస్‌కు చెందిన న్యూరోట్రోపిక్ స్వభావం నేరుగా నాడీ కణాలను తాకడం వల్లే ఇలా జరుగుతుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గినప్పుడు శరీరంలోని వివిధ భాగాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. చివరికి మెదడులో కూడా రక్తస్రావం జరిగి.. పరిస్థితి మరింత దిగజారే ముప్పు ఉంది. కాబట్టి, డెంగ్యూను తేలిగ్గా తీసుకోవద్దు. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చులే అనుకోవద్దు. డెంగ్యూ రోగిని హాస్పిటల్‌లో చేర్చి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచడం చాలా మంచిది. 


ప్లేట్‌లెట్స్ సంఖ్య ఎంత తగ్గితే ప్రమాదకరం?


సాధారణంగా శరీరంలో ప్రతి మైక్రో లీటర్ రక్తంలో 150,000 నుంచి 450,000 వరకు ప్లేట్ లెట్స్ ఉండాలి. 150,000 కంటే తక్కువ ప్లేట్‌లెట్స్ ఉంటే.. సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తారు. డెంగ్యూ సోకిన రోగిలో ప్లే‌ట్‌లెట్స్ చాలా వేగంగా తగ్గిపోతుంటాయి. ప్లేట్‌లెట్స్ 50,000 వరకు తగ్గినట్లయితే.. తప్పకుండా హాస్పిటల్‌లో జాయిన్ కావాలి. ప్లేట్‌లెట్స్ సంఖ్య 20,000 తక్కువకు పడిపోతే.. శరీరంలో రక్తస్రావం ఏర్పడుతుంది. కాబట్టి, దోమలతో జర భద్రం. మీకు జ్వరం వచ్చి తగ్గుతున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సూచన మేరకు రక్తం, ప్లేట్‌లెట్స్‌ల పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఒక వేళ ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతున్నట్లు రిపోర్టులో తేలితే.. మరింత అప్రమత్తంగా ఉండాలి. పైన సూచించిన సంఖ్యకు ప్లేట్‌లెట్స్ పడిపోతే హాస్పిటల్‌లో చేరడం ఉత్తమం.


Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!