పెరుగు తయారీకి సాధార‌ణంగా మ‌నం పాల‌లో పెరుగు చూక్క వేసి తోడు పెడ‌తాం. కానీ ఈ గిన్నెలో పాల‌ను పోసి ఉంచితే చాలు.. పెరుగుగా మారుతుంది. ఇందులో ఎటువంటి పెరుగు చుక్కా వేయాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి గిన్నె ఒక‌టి ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయితే ఆ గిన్నె ఏమిటో, ఎక్క‌డ దొరుకుతుందో తెలుసుకుందామా?


భార‌త‌దేశం వింత‌ల‌కు.. ర‌హ‌స్య విష‌యాల‌కు నెల‌వైన దేశం. ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా విన‌ని, చూడ‌ని అనేక‌ విష‌యాలు, వ‌స్తువుల‌ను మ‌నం ఇక్క‌డ చూస్తుంటాం, వాటి ప్రత్యేకతల గురించి వింటుంటాం. అయితే, మీరు తప్పకుండా ఈ గిన్నె గురించి తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. ఇదో విచిత్రమైన రాతి గిన్నె. ప్ర‌త్యేక‌మైన శిలాజంతో త‌యారైన ఈ పురాత‌న రాయి.. ఎటువంటి పులియ‌బెట్టే ప‌దార్థాల‌ను వాడ‌కుండానే పాల‌ను పెరుగుగా మారుస్తుంది. అంతేకాదు, గడ్డ పెరుగు కంటే గట్టిగా.. ఐస్ క్రీమ్‌ను తలపిస్తుంది. రుచి కూడా అదిరిపోతుంది. ఎంతో కమ్మగా మళ్లీ మళ్లీ తినాలి అనిపించేలా పెరుగు తయారవుతుందట.


ఈ గిన్నె ప్రత్యేకత ఏమిటి?


ఇది ఒక రకమైన రాతితో చేసిన ప్రత్యేక గిన్నె. మీరు రాత్రి పాలు పోస్తే, అది ఉదయానికి పెరుగుగా మారుతుంది. అతి పెద్ద విషయం ఏమిటంటే, ఈ పెరుగును సెట్ చేయడానికి మరే ఇతర ప‌దార్థాన్ని ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం లేదు. పెరుగును చేర్చాల్సిన అవ‌స‌రం లేదు. ఈ రాతి గిన్నెలో పాలు మాత్రమే పోస్తారు.. ఉదయానికి అది అద్భుత‌మైన ఐస్ క్రీంలా మారుతుంది. పాల‌ను పులియ‌బెట్టేందుకు ఎటువంటి ప‌దార్థాల‌ను వినియోగించ‌క‌పోవ‌డం ఈ రాయి విశేషం. ఈ రాయిలోని కొన్ని ప్ర‌త్యేక ర‌సాయ‌నాల కార‌ణంగానే ఎటువంటి పులియ‌బెట్టే ప‌దార్థాలు వాడ‌కుండానే పాలు పెరుగుగా మారుతున్నాయట.


ఎక్క‌డ ల‌భిస్తుంది?


ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా ఈ గిన్నె లభించదు. రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌కు యాభై కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హ‌బూర్ అనే గ్రామంలో మాత్ర‌మే ల‌భిస్తుంది. హబూర్ సున్నపురాయి దాదాపు 125 మిలియన్ సంవత్సరాల పురాత‌న‌మైన‌ది. ఇది డయాబెటిక్, రక్తపోటు నియంత్రణ మొదలైన ఔషద గుణాలను కలిగి ఉంటుంది. ఇది పులియబెట్టకుండా పాలను పెరుగుగా మార్చగలదు. ఈ గిన్నెను త‌యారు చేసేందుకు వినియోగించే రాయిని హ‌బురియా భాటా అంటారు. ఈ గ్రామ ప్రజలు ఈ రాయిని అద్భుతంగా భావిస్తారు. ఈ రాయితో చేసిన గిన్నెలను కొనుగోలు చేయడానికి దేశ విదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.


పాలు పెరుగులా ఎలా మారుతాయి?


ఈ రాతి చెంబులో పాలు పోస్తే అది పెరుగు ఎలా అవుతుంది అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తవచ్చు. దీనిపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. విదేశీ నిపుణులు సైతం ఈ రహస్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఈ రాయిలో అమినో యాసిడ్, ఫినైల్ అలీనియా, రిఫ్టాఫెన్ టైరోసిన్ వంటి రసాయనాలు ఉన్నాయని ప‌రిశోధ‌న‌లో తేల్చారు. ఇవి పాల‌ను పెరుగుగా మార్చేందుకు సహకరిస్తున్నాయని కనుగొన్నారు. మీకు కూడా ఇలాంటి రాతి పాత్ర కావాలా? ఈ సారి రాజస్థాన్ వెళ్లేప్పుడు తప్పకుండా తీసుకోండి.


Also Read: మన దేశంలో డయాబెటిస్, ఒబేసిటీ రోగులు ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial