Dussehra Recipes: దసరా సందడి మొదలైపోయింది. ఇప్పటికే చాలా ఇళ్లలో పిండి వంటలు రెడీ అయిపోతున్నాయి. ఇక పండగరోజు అమ్మవారిని పూజిస్తూ మూడు లేదా అయిదు నైవేద్యాలు తయారు చేస్తారు చాలా మంది. వాటిల్లో స్వీట్ రెసిపీలు అధికంగా ఉంటాయి. అమ్మవారికి నివేదించాక వాటిని ప్రసాదాలుగా స్వీకరిస్తారు. తమ చుట్టు పక్కల వారందరికీ పంచిపెడతారు. పండుగరోజు ఎప్పుడూ పూర్ణం బూరెలు, భక్య్షాలేనా కాస్త ట్రెండు మార్చండి. ఈ స్వీట్ రెసిపీలు కూడా ప్రయత్నించండి. చేయడానికి సులువే కాదు, చాలా తక్కువ సమయంలో అయిపోతాయి.  


పెసరపప్పు పొంగలి
కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒక కప్పు
పెసరపప్పు - ఒక కప్పు
బెల్లం - రెండు కప్పులు
జీడిప్పులు - పది
కిస్ మిస్‌లు - పది
కొబ్బరి ముక్కలు - అరకప్పు
నీళ్లు - తగినన్ని 
బాదం పప్పులు - పది
నెయ్యి - అర కప్పు
యాలకుల పొడి -  అర స్పూను


తయారీ ఇలా 
1. స్టవ్ మీద కళాయి పెట్టి అర కప్పు నెయ్యి వేయాలి. అందులో కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. 
2. అదే నెయ్యిలో జీడిపప్పు, కిస్‌మిస్, బాదం పప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. 
3. ఇప్పుడు బియ్యం, పెసపప్పు బాగా కడిగి మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. 
4. కుక్కర్ ఓపెన్ చేసి అందులో బెల్లం తురుము వేసి కరిగించాలి. 
5. బెల్లం మొత్తం కరిగాక అవసరమైతే కాస్త నీరు వేసుకోవచ్చు. 
6. గరిటెతో మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. 
7. మిశ్రమం పాయసంలా రెడీ అవుతుంది. 
8.  అప్పుడు ముందుగా వేయించుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, కిస్ మిస్‌లు వేసి బాగా కలపాలి. 
9. అంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు పొంగలి నైవేద్యం రెడీ అయినట్టే. 
.......................
బాదం పాయసం
కావాల్సిన పదార్థాలు


బాదం పప్పులు: ఒక కప్పు
పాలు - ఆరు కప్పులు
పంచదార - ఒక కప్పు
నీళ్లు - ఒక గ్లాసు
కుంకుమ రేకలు: అయిదు రేకలు 


తయారీ ఇలా 
1. ముందుగా బాదం పప్పులను నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పొట్టు సులువుగా వచ్చేస్తుంది. 
2. తరువాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. 
3. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేయాలి. 
4. పాలు మరిగాక బాదం పేస్టు వేసి బాగా కలపాలి. పదినిమిషాల పాటూ ఉడికించాలి. 
5. తరువాత అందులో చక్కెర వేయాలి. 
6. మిశ్రమం చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. 
7. కుంకుమపూల రేకలు వేసి దించేయాలి.
8. టేస్టీ బాదం పప్పు పాయసం సిద్దమైనట్టే. 


నవరాత్రులలో చివరి రోజు..  ఆశ్వయుజ శుద్ధ నవమిని ''మహర్నవమి'' అంటారు. ''దుర్గాష్టమి'', ''విజయదశమి'' లాగే ''మహర్నవమి'' కూడా అమ్మవారికి విశేషమైన రోజు అని పండితులు చెబుతున్నారు. మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు.
ఈ రోజున అమ్మవారు సింహ వాహిని గా పది చేతులలో ఆయుధాలు ధరించి మందస్మిత హాసినిగా దర్శనం ఇస్తుంది. మహిషాసుర వధ తర్వాత మహిషాసుర మర్థిని గా ఈరోజున దేవిని కొలుచుకుంటారు. మహార్నవమి రోజున ఎర్రచీరను దేవికి అలంకరిస్తారు.   కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.


Also read: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం



Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది