కొన్ని చిట్కాలు చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ వాటిని పాటించడం ద్వారా పెద్ద లాభాల్నే పొందచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం అయితేనే దాన్నుంచి మనకు పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ అందేది. జీర్ణం కాలేదో కడుపునొప్పి, మంట ఇలా చాలా సమస్యలు మొదలవుతాయి. భోజనం చేశాక కొన్ని పనులు చేయకుండా ఉంటే ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. 


1. చాలా మంది రాత్రి భోజనం పొట్ట నిండా తిని, భుక్తాయాసంతో వెంటనే నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ రేటు దెబ్బతింటుంది. కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా అనిపించడం వంటివి జరగొచ్చు. పడుకున్నప్పుడు జీర్ణ రసాలు అన్నవాహికలోకి జారి గుండెల్లో మంట కలగవచ్చు. కనుక భోజనం తిన్నాక కనీసం ఓ గంట పాటు నిటారుగా కూర్చోండి. దీని వల్ల జీర్ణ రసాలు తమ పని తాము సక్రమంగా చేస్తాయి. 
2. చాలా మందికి ఉండే అలవాటు భోజనం పూర్తయ్యాక పండ్లు తినడం. ఆహారపదార్థాలను బట్టి అవి జీర్ణమయ్యే రేటు ఆధారపడి ఉంటుంది. పండ్లు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. భోజనం చేశాక పండ్లు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొట్టలో ముందుగా తిన్న అన్నం జీర్ణం అవుతుంటుంది, ఆ తరువాత పండ్లు. ఈ లోపు పండ్లు పులిసిపోవడం ప్రారంభమై గ్యాస్ విడుదలకు కారణం అవుతాయి. కాబట్టి భోజనానికి ముందు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. 
3. కొంతమందికి భోజనం చేశాక టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతినొచ్చు. టీ ఆకుల్లో ఆమ్లం ఉంటుంది, అది ఆహారాన్ని జీర్ణం చేసుకునే శరీర సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. టీలో పాలీఫెనాల్స్, టానిన్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని విడుదలయ్యే ఇనుమును అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇనుము మన దేహానికి ఎంత అవసరమో తెలుసుకదా... అందుకే భోజనం చేశాక టీ తాగక పోవడం చాలా మంచిది. భోజనానికి, టీకి కనీసం రెండు గంటల గ్యాప్ వచ్చేలా చూసుకోండి. 
4. అధికంగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. భోజనం చేసే సమయంలో, ఆ తరువాత నీళ్లు తక్కువగా తాగాలి. ఎక్కవగా తాగితే ఆ నీళ్లు జీర్ణ రసాలను పలుచగా మారుస్తాయి. దీంతో అవి ప్రభావవంతంగా తమ పని తాము చేయలేవు. తద్వారా ఆహారం విచ్చిన్నం అవ్వడానికి సమయం పడుతుంది. అరుగుదల సమస్య రావచ్చు. 
5. టిఫిన్ లేదా భోజనం తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు చాలా మంది. కాని ఇది మీ జీర్ణ క్రియకు ఆటంకం కలిగిస్తుంది. స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ నుంచి రక్తం ఎక్కువ భాగం శరీరం ఉపరితలంలోని చర్మంలోకి, అవయవాల్లోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. 
6. మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహారాన్ని తినకండి. సాధారణ స్థితికి వచ్చాక భోజనం చేయండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు కేంద్రనాడీ వ్యవస్థ (సెంట్రల్ నెర్వ్స్ సిస్టమ్) మీ జీర్ణ వ్యవస్థకు రక్త సరఫరాను సరిగా కానివ్వదు. జీర్ణ కండరాల సంకోచాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు అవసరమైన స్రావాలను తగ్గిస్తుంది. 


ఏం చేయాలి?
భోజనం చేశాక ఏదైనా తాగాలనిపిస్తే అల్లం టీ తాగండి. ఆయుర్వేదం ప్రకారం అల్లంటీ చిన్నపేగుల్లో ఆహారం కదలికను మెరుగుపరుస్తుంది. జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గ్యాస్, కడుపుమంట, తిమ్మిరి రాకుండా నిరోధిస్తుంది. తద్వారా జీర్ణ క్రియ సజావుగా సాగుతుంది. 


Also read: షుగర్ వ్యాధి ఒంట్లో చేరి ఏం చేస్తుందో తెలుసా... జాగ్రత్త పడండి
Also read: మంచి బ్యాక్టిరియాతో మెదడుకు సంబంధం... వాటి కోసం ఏం తినాలంటే...
Also read: పిల్లలకు రోజుకో అరస్పూను నెయ్యి తినిపించండి... మతిమరుపు దరిచేరదు