సీ ఫుడ్స్ లో బలవర్ధకమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అంతే కాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. గుండెకి మేలు చేస్తుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి 12 జ్ఞాపకశక్తిని పెంచి మతిమరుపు వ్యాధి దారి చేరకుండా చూస్తుంది. చర్మ సౌందర్యానికి ఇది మేలు చేస్తుంది. చర్మ సంరక్షణకు అవసరమయ్యే విటమిన్ సి ఇందులో లభిస్తుంది. ఎంతో రుచిగా ఉండే రొయ్యలు చర్మంపై దురదలు, అలర్జీకి కారణం అవుతాయని మీకు తెలుసా? అదెలా అనుకుంటున్నారా.. రొయ్యల వీపుపై ఉండే నల్లని రక్తనాళాలు తొలగించకపోతే తీవ్రమైన సమస్యలు రావచ్చు. వాటిని ఉన్నప్పుడు తినడం వల్ల మరణం కూడా సంభవించొచ్చు. అందుకే వాటిని వండుకునే ముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.


ఏంటి ఈ రక్తనాళాలు


రొయ్యల మీద ఉండే నల్లటి రక్తనాళాలు తప్పనిసరిగా తొలగించాలి. ఇది వ్యర్థాలు, విషపదార్థాలను మోసే ఈ సముద్ర ఆహారాల పేగు మార్గం. ఈ సిరలను తొలగించకపోవడం లేదా పాక్షికంగా వాటిని తొలగించడం వలన తీవ్రమైన ఫుడ్ అలెర్జీ రావడమే కాదు, అదే సమయంలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే అలాంటి అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ రక్తనాళాలని తప్పకుండా తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.


అవి ఉండగా తింటే ఏమవుతుంది?


రొయ్యల మీద కనిపించే నల్లని రక్తనాళాలు తొలగించకుండా తినడం వల్ల ఆహార అలర్జీకి దారి తీస్తుంది. అయితే అది తిన్న వెంటనే ఒక్కోసారి మీకు కనిపించకపోవచ్చు. అది పేగుల్లో వ్యర్థాలు, టాక్సిన్స్, రసాయనాలు రూపంలో ఉంటుంది. ఇవి మన జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని తొలగించకుండా వండుకుని తినడం వల్ల సడెన్ గా చర్మంపై దద్దుర్లు రావాడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, గొంతులో ఇబ్బంది తలెత్తవచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఇవి తినడం వల్ల ప్రాణాలకి హాని జరుగుతుందనే విషయం తేల్చడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఎలా క్లీన్ చెయ్యాలి?


రొయ్యలు చల్లని నీటిలో వేసి బాగా కడగాలి. దుర్వాసన పోయేలా శుభ్రం చెయ్యాలి. కత్తితో రొయ్యల తల, తోకలని కత్తిరించాలి. తర్వాత రొయ్యల చుట్టూ చీలిక చేసి వాటి దగ్గర ఉండే నల్లటి లేదా ఆకు పచ్చని రక్తనాళాలని కత్తితో కత్తిరించి తొలగించాలి. తర్వాత రొయ్యల కాళ్ళని తొలగించాలి. చివరగా రొయ్యలని మరోసారి చల్లని నీటితో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల దానికి ఉండే నీసు వాసన పోతుంది. ఆ తర్వాతే వాటిని వండుకుని తినాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also read: మీరు పెళ్లికి సిద్ధమయ్యే ముందు మీ కాబోయే భార్యని లేదా భర్తని కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ఇవే


Also read: అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి క్వీన్ ఎలిజబెత్ వరకు ప్రపంచం మెచ్చిన పాలకులు ఇష్టంగా తాగే పానీయాలు ఇవే