Diabetes Cure With Cell Therapy: మధుమేహంతో బాధపడుతున్న చైనా ప్రజలకు అక్కడి పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. డయాబెటిస్ కు కొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టారు. ఈ మేరకు చైనా షాంఘైలోని షాంఘై చాంగ్‌జెంగ్ హాస్పిటల్ పరిశోధకులు కీలక ప్రకటన చేశారు. సెల్ థెరపీ అనే కొత్త చికిత్సా విధానం ద్వారా మధుమేహాన్ని నయం చేసినట్లు తెలిపారు. చైనా మార్నింగ్ మ్యాగజైన్ ఈ మేరకు కీలక పరిశోధన కథనాన్ని ప్రచురించింది.


సెల్ థెరపీతో డయాబెటిస్ క్యూర్


గడిచిన 25 ఏళ్లుగా సెల్ థెరపీ పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు చైనా వైద్యులు. డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ 59 ఏళ్ల బాధితుడిపై ఈ ప్రయోగం మొదలు పెట్టారు. ఇదే వ్యక్తికి 2017లో షుగర్ కారణంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఈ పరిశోధన విస్తృతం చేశారు. సెల్ థెరపీ ద్వారా అతడికి చికిత్స కొనసాగించారు. ఈ ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత సుమారు 10 నుంచి 11 వారాల తర్వాత ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదు. షుగర్ కంట్రోల్ కోసం టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. సెల్ థెరపీ మొదలు పెట్టిన తర్వాత డయాబెటిక్ పేషెంట్ లో ప్యాంక్రియాటిక్ ఐలెట్ పని తీరు మెరుగు పడినట్లు గుర్తించారు. ఆ తర్వాత సదరు రోగి పూర్తిగా మధుమేహం నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు.


వైద్య పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం


డయాబెటిస్ నిర్మూలన కోసం రూపొందించిన సెల్ థెరపీ ఆధునిక వైద్య విధానంలో కొత్త ట్రీట్మెంట్ అవుతుందని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ సెల్ థెరపీ ఎంతో మంది రోగులకు మేలు చేయబోతుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం సెల్యులార్, ఫిజియోలాజికల్ సైన్సెస్ విభాగం అధినేత తిమోతీ కీఫెర్ వెల్లడించారు. దశాబ్దం పాటు కొనసాగిన ఈ పరిశోధనలో కీలక ఫలితాలు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


టాబ్లెట్లు, ఇంజెక్షన్లకు ఇకపై చెక్!


వాస్తవానికి మధుమేహంతో చాలా కాలం బాధపడే వారికి చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుంది. డయాబెటిస్ ముదిరితే గుండె, కిడ్నీతో పాటు కంటి సమస్యలు ఏర్పడుతాయి. దీంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునేందుకు బాధితులు టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సెల్ థెరపీతో టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పే అవకాశం ఉంది. సెల్ థెరపీ ద్వారా డయాబెటిక్ పేషెంట్లలోని పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్‌ ను సీడ్ సెల్స్ గా మారుస్తారు. ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్ రీ క్రియేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ చేశారు. ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ కొత్త విధానానికి సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇంకా కొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవి కూడా సక్సెస్ అయితే, ఈ విధానం అమల్లోకి రానుంది.  
  


అత్యధిక డయాబెటిక్ పేషెంట్లు ఉన్న దేశం చైనా


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డయాబెటిక్ పేషెంట్లలో ఎక్కువ మంది చైనాలోనే ఉన్నారు. డ్రాగన్ కంట్రీలో ఏకంగా 140 మిలియన్ల మంది డయాబెటిస్ పేషెంట్లు ఉన్నట్లు అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ వెల్లడించింది. సెల్ థెరపీ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తే వారందరికీ మేలు కలిగే అవకాశం ఉంది.    


Also Read : లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారట.. డివోర్స్ కేసులలో వీరిదే పై చేయి