తినే ఆహారమే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే పోషకాహారం తినమని చెబుతారు వైద్యులు. కొన్ని రకాల ఆహారపదార్థాలు మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తాయి. హార్వర్డ్ యూనివర్సిటీలోని పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం అయిదు రకాల ఆహారాలను దూరం పెడితే ఏకాగ్రత, మెమొరీ అద్భుతంగా పెరుగుతుంది. చిత్త  వైకల్యం కూడా చాలా తగ్గుతుందని ఇంతకుముందు చేసిన చాలా అధ్యయనాల్లో తేలింది. ఆ అయిదు ఆహారాలు ఏవంటే...


ఆల్కహాల్
అనారోగ్యకరమైన ఆహారాలలో ఆల్కహాల్‌ది మొదటి స్థానం. కొంతమంది ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఇలాంటి పానీయాలకు అలవాటు పడుతున్నారు. 2018లో బ్రిటన్ లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం మద్యపానానికి దూరంగా ఉండే వారితో పోలిస్తే, వారానికి 14 సార్లు కన్నా ఎక్కువ సార్లు మద్యం తాగేవారిలో అతి త్వరగా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉంది. 


నైట్రేట్లు అధికంగా ఉండే ఆహారం
నైట్రేట్లు ఉన్న ఆహారపదార్థాలు డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతాయి అని కొన్ని పరిశోధనలు తేల్చాయి. తాజాగా చేసిన మరో అధ్యయనంలో పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను ఇవి కల్తీ చేస్తాయని, అలాగే బైపోలార్ డిజార్డర్ వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంటుందని తేలింది. 


డీప్ ఫ్రై ఆహారాలు
ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, ఫ్రైడ్ చికెన్, డోనట్స్ వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం ఎక్కువ వేయించిన ఆహారాన్ని తీసుకునే వ్యక్తులలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఈ అధిక కేలరీల ఆహారాలు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల వాపును ప్రేరేపిస్తాయి. అంతేకాదు ఈ ఆహారం డిప్రెషన్ వచ్చే అవకాశాన్ని కూడా పెంచుతుంది.


అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు
బ్రెడ్, పాస్తా వంటి శుధ్ది చేసిన పిండితో తయారుచేసిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఈ పదార్థాలు రుచికి తీపిగా అనిపించకపోయినా శరీరంలో చేరాక మాత్రం చక్కెరగా ప్రాసెస్ అవుతాయి. వీటిని తరచూ తింటుంటే దీర్ఘకాలంలో బరువు పెరగడం, జీవక్రియలోపాలు, డయాబెటిస్ వంటి రోగాల బారిన పడొచ్చు. 


చక్కెరతో చేసిన పదార్ధాలు
చక్కెరతో చేసిన తీపి పదార్థాలు తినడం వల్ల శరీరం దాన్ని గ్లూకోజ్ గా మార్చుకుంటుంది. అధిక చక్కెర వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఇది  జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. కృత్రిమ స్వీటెనర్‌లు, కాల్చి చేసిన వంటలు, శుద్ధి చేసిన చక్కెరతో చేసిన వంటలు అభిజ్ఞా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం మగవాళ్లు రోజుకు 36 గ్రాముల కంటే ఎక్కువ, మహిళలు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తినకూడదు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు


Read Also: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...


Read Also: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...


Read Also:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి