మనదేశంలో దేశరాజధాని దిల్లీతో పాటూ అనేక ప్రధాన నగరాలలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుందని తెలుసు. కానీ ఇప్పుడు మరో కొత్త విషయం తెలిసింది. అదేంటంటే గాలి కాలుష్యం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఫలితంగా జీవితం అల్లకల్లోలం అవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 


గాలిలో చెడు వాయువుల శాతం పెరుగుతోందని, దీని వల్ల మనుషుల్లో మానసిక ఆందోళన వంటి సమస్యలు గణనీయం పెరిగే అవకాశం ఉందని లండన్ లో జరిగిన ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు తేల్చారు. లండన్లో గాలి కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతంలో  నివసిస్తున్న 13,000 మందిపై ఈ పరిశోధనను చేశారు. వారిలో గాలి కాలుష్యం వల్ల 18 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవకాశం పెరిగినట్టు పరిశోధనలో తేలింది. వారి మానసిక ఆరోగ్యం అస్థిరంగా మారినట్టు గమనించారు. ఇది వారి ఆలోచనా తీరు, మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. 


Also read: బీట్ రూట్ హల్వా తయారీ.. టేస్టీ అండ్ హెల్దీ!


గాలిలో కలుస్తున్న వాయువుల్లో అతి ప్రమాదకరమైనది నైట్రోజన్ డయాక్సైడ్. ఇంధనాలు మండడం వల్ల ఈ వాయువు విడుదలవుతుంది.  వాహనాలు, వందల కొద్దీ ఉన్న పరిశ్రమల నుంచి కూడా విషపూరిత వాయువులెన్నో గాలిలో కలుస్తున్నాయి.  వీటన్నింటి వల్లే శ్వాసనాళాల్లో వాపు రావడం, దగ్గు వంటి అనేక చెడు ప్రభావాలు కలుగుతాయి. వాటితో పాటూ మానసికంగానూ సమస్యలను తెచ్చిపెడుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. 


Also read: గురువు మారాడు.. పూరి గుడిసెలో పాఠాలు చెప్పే దగ్గరి నుంచి.. నెట్టింట్లో ఆన్ లైన్ క్లాసులు దాకా


మనదేశంలో కూడా 612 జిల్లాల్లో వాతావరణం మారుతోందని, కాలుష్యం పెరుగుతోందని, అందులో 100 జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉందని ఇప్పటికే బెంగళూరు ఐఐటీ చేసిన ఓ సర్వేలో తేలింది. అంతెందుకు రాజధాని దిల్లీ నగరం విషపూరిత మైన దట్టమైన పొగతో కప్పబడిన సందర్భాలూ కూడా ఉన్నాయి. ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం కాలుష్యం పెరుగుతున్న దేశాల్లో మన స్థానం ఇప్పటికే మూడో స్థానంలో నిలిచింది. అంతేకాదు కాలుష్య రాజధానుల్లో దిల్లీదే తొలిస్థానం. కాబట్టి మన ప్రజల మానసిక స్థితిగతులపై గాలి కాలుష్యం ప్రభావం చూపే ప్రమాదం ఎక్కువే ఉంది. ఈ కాలుష్యం ప్రజల ఊపిరితిత్తులు నిశ్శబ్దంగా చంపేస్తోంది. 


Also read: దేశంలో 42 వేల కరోనా కేసులు నమోదు.. 308 మంది మృతి