తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-2,3,4 పోస్టులకు మరికొన్ని పోస్టులను చేర్చిన ప్రభుత్వం,తాజాగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి 9వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలోని గురుకులాల్లోనూ భారీగా పోస్టుల సంఖ్య పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన 9,096 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు అదనంగా దాదాపు 3 వేల పోస్టులు రానున్నాయి.


రాష్ట్రంలో 2022-23 ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పోస్టుల మంజూరు దస్త్రంపై సీఎం సంతకం చేసి, బీసీ సంక్షేమశాఖకు పంపించారు. ప్రస్తుత నియామకాల్లో భాగంగా ఇవి భర్తీ కానున్నాయి. దాదాపు 12 వేలకుపైగా పోస్టులకు వారం, పది రోజుల్లో ఒక్కొక్కటిగా ప్రకటనలు జారీ చేసేందుకు గురుకుల నియామక బోర్డు సన్నాహాలు చేస్తోంది.


Also Read: తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!


బీసీ గురుకులాల్లో ఎక్కువ పోస్టులు...
గురుకుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి అత్యధిక పోస్టులు బీసీ గురుకులాల్లోనే ఉన్నాయి. ఈ సొసైటీ పరిధిలో గతంలో అనుమతించిన 3,870 పోస్టులకు అదనంగా మరో 3వేల ఖాళీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో బీసీ సొసైటీ పరిధిలోనే దాదాపు 6 వేలకు పైగా బోధన పోస్టులు ఉండనున్నాయి. ఇప్పటికే 2017లో మంజూరైన 119 బీసీ గురుకులాలు జూనియర్  కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. వచ్చే ఏడాది నుంచి మరో 119 కళాశాలలు అప్‌గ్రేడ్ కానున్నాయి. దీంతో ఈ సొసైటీ పరిధిలో అత్యధిక పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పాఠశాలలు అప్‌గ్రేడ్ కావడం, కొత్తగా ఈ ఏడాది గురుకులాలు రావడంతో వీటిలోనూ పోస్టులు భర్తీకానున్నాయి. బీసీ గురుకుల సొసైటీ తరువాత అధికంగా ఎస్సీ గురుకుల సొసైటీలో 2,267 పోస్టులు ఉన్నాయి. గురుకుల సొసైటీల్లో సీనియర్ కేడర్ అధికారిగా ఉన్న ఎస్సీ సొసైటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రొనాల్డ్‌రాస్ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. గతంలో బోర్డు కన్వీనర్‌గా పనిచేసిన అధికారి కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఆయన స్థానంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. మిగతా ఎస్టీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.


Also Read: నవోదయ విద్యాలయ సమితిలో 2,200 టీచర్ పోస్టుల భర్తీ - రాత పరీక్ష షెడ్యూలు వెల్లడి!


త్వరలోనే ప్రకటనలు..
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు బోధన, బోధనేతర సిబ్బంది సర్దుబాటు పూర్తికావడంతో జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను గుర్తించింది. తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, గిరిజన రిజర్వేషన్ల పెంపుతో వీటికి సవరణలు పూర్తిచేసింది. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలయ్యేలా రోస్టర్ ప్రాతిపదికన పోస్టులను రిజర్వు చేసింది. ఈ ప్రక్రియను సొసైటీలన్నీ పూర్తిచేసి, ఇటీవల గురుకుల నియామక బోర్డుకు ప్రతిపాదనలు పంపించాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ సొసైటీ ఒకసారి ఇప్పటికే పరిశీలించింది. పోస్టుల గుర్తింపు, ప్రభుత్వ అనుమతి రావడంతో భర్తీకి ప్రకటనలు ఏవిధంగా విడుదల చేయాలన్న విషయమై బోర్డువర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి.


పక్కా ప్రణాళికతో ముందుకు.. 
టీజీటీ, పీజీటీ, లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ప్రిన్సిపల్ పోస్టులన్నిటికీ ఒకేసారి వెలువరించాలా? లేదా ? ఒక్కోకేటగిరీ పోస్టుకు కొంత కాల వ్యవధితో ఇవ్వాలా? అనే విషయాన్ని పరిశీలిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అన్ని పోస్టుల పరీక్షలు రాసేందుకు వీలుగా అవకాశమివ్వాలని, ఈ మేరకు నోటిఫికేషన్ల వెల్లడి నుంచి పరీక్ష తేదీల ఖరారు వరకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించింది. గురుకులాల్లోని బోధన పోస్టుల్లో బ్యాక్‌లాగ్ ఏర్పడకుండా ఉన్నతస్థాయి నుంచి దిగువకు క్రమపద్ధతిలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తోంది. రాతపరీక్షలు నిర్వహించిన తరువాత ఫలితాలను ఉన్నత పోస్టుల నుంచి కిందిస్థాయి పోస్టుల వరకు కాలవ్యవధిలో వెల్లడించి నియామకాలు పూర్తిచేయాలని భావిస్తోంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...