TS Police Constable Recruitment: తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోలీసు నియామక మండలి (TSLPRB) సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో గతేడాది అక్టోబర్‌ 4న ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాలనే ఫైనల్‌ చేస్తూ.. టీఎస్‌ఎల్‌పీఆర్బీ నుంచి తుది ప్రకటన వెలువడనుంది. నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ పోలీసు నియామక బోర్డు ఉన్నతాధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 కానిస్టేబుల్ పోస్టులకుగాను 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.


కానిస్టేబుల్ నియామకాల్లో జరిగిన తప్పొప్పులపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. నిపుణుల కమిటీ వయాలన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్చు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసు, జైళ్లు, ఫైర్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ శాఖల అధికారులకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ నిరుడు అక్టోబర్‌ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్‌ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఆయా విభాగాల నియామక పత్రా లు తయారు చేసుకోవాలంటూ రాష్ఱ్రహోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు, ఇతర లేఖలు వెళ్లాయి. డ్రైవర్‌, మెకానిక్‌ పోస్టులకూ లైన్‌క్లియర్‌ అయినట్టు సమాచారం.


గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో 587 ఎస్ఐ, తత్సమాన ఉద్యోగాలకు, 16,604 కానిస్టేబుల్‌ తత్సమాన ఉద్యోగాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్‌ నుంచి 587 ఎస్ఐ ఉద్యోగాలకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ బోర్డు ప్రిలిమినరీ, ఫిజికల్ ఈవెంట్స్, ఫైనల్ పరీక్షలు నిర్వహించి, గత ఆగస్టులోనే తుది ఫలితాలను వెల్లడించింది. దీంతో ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికైన 587 మంది అభ్యర్థులు రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అభ్యర్థుల నియామక ప్రక్రియ 2022 ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైంది. గర్భిణులైన అ భ్యర్థినులతో మొదలైన చిన్న చిన్న వివాదాలు.. తుది పరీక్షలో వచ్చిన అనువాద ప్రశ్నల వరకు చాలా సందర్భాల్లో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయినా, టీఎస్‌ఎల్‌పీఆర్బీ ఎప్పటికప్పుడు హైకోర్టు సూచనలు పాటిస్తూ.. నియామక ప్రక్రియను కొనసాగించింది.


బోర్డు నుంచి సరైన వివరణ..
సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా నోటిఫికేషన్‌ ఇచ్చిన దగ్గర్నుంచి.. తుది ఫలితా లు విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్ర కారం నిర్వహించామని, సాంకేతికంగా కూ డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకొన్నామని బోర్డు తరఫు న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా.. బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూ డా ముగియనున్నది. దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉన్నదని విశ్వసనీయంగా తెలిసింది.


12 నుంచి నియామక పత్రాల జారీ..
ఫిబ్రవరి 12 నుంచి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఫిబ్రవరి 12 నుంచి నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. అభ్యర్థులకు ఫిబ్రవరి 12 నుంచే నియామకపత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంవో, హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కుదిరితే ఫిబ్రవరి 12కు ముందే లేదా ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది.