SBI  CBO Admitcard: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(CBO) రాతపరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు జనవరి 16న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/ రూల్ నెంబరు లేదా పాస్‌వర్డ్/ పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జనవరి 21న ఆన్‌లైన్ ఆధారిత రాతపరీక్ష (CBT) నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.


దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ శాఖలలో సీబీవో పోస్టుల భర్తీకి నవంబరు 22న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5,447 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి నవంబరు 22 నుంచి డిసెంబరు 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 21న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ తాజాగా వెల్లడించింది. ఎంపికైనవారికి నెలకు రూ.36,000 - రూ.63,840 వరకు జీతం ఉంటుంది. 


పరీక్ష విధానం:
✪ మొత్తం 120 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్రశ్నలు-30 మార్కులు,  బ్యాంకింగ్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్/ఎకానమీ-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. 


✪ అదేవిధంగా 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ (లెటర్ రైటింగ్, ఎస్సే) ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు.



సర్టిఫికెట్ల స్క్రీనింగ్‌
ఎంపిక ప్రక్రియ రెండో దశలో.. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దరఖాస్తులను, సర్టిఫికెట్లను ప్రత్యేక స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుంది. అప్పటికే వారు చేస్తున్న ఉద్యోగం, ఇతర అర్హతల వివరాలను పరిశీలిస్తారు.


పర్సనల్‌ ఇంటర్వ్యూ..
రాత పరీక్ష, స్క్రీనింగ్‌ దశల్లో మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను గుర్తించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా.. ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున చివరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న ఆసక్తి, సమకాలీన పరిణామాలపై అవగాహన, బ్యాంకింగ్‌ రంగ పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ఈ ఇంటర్వ్యూ ఉంటుంది.


వెయిటేజీ విధానం..
తుది ఎంపికలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో ప్రతిభకు 75 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంటే..170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులను 75 శాతానికి.. 50 మార్కులకు జరిపే ఇంటర్వ్యూలో పొందిన మార్కులను 25 శాతానికి మదింపు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా తుది విజేతలను ఖరారు చేస్తారు.


లాంగ్వేజ్‌ టెస్ట్‌..
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాని­కి చెందిన భాషకు సంబంధించిన పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో విజయం సాధించి.. మెరిట్‌ జాబితా­లో నిలిచిన వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే నియామకం ఖరారు చేస్తారు. పదో తరగతి, 12వ తరగతిని సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృ భాషలో చదివిన వారికి ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు కల్పిస్తారు.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..