Udaya Bhanu Re Entry: ఒకప్పుడు బుల్లితెరపై ఫేమస్ ఫీమేల్ యాంకర్ ఎవరు అంటే చాలామంది దగ్గర వినిపించే పేరు ఉదయభాను. ప్రతీ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌లో ఉదయభాను యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్ ఉండేది. తను యాంకరింగ్ చేసిందంటే చాలు.. బుల్లితెర ప్రేక్షకులు ఆ షోను కచ్చితంగా చూస్తారు అని మేకర్స్‌కు గట్టి నమ్మకం ఉండేది. అలాంటి ఉదయభాను మెల్లగా తన యాంకరింగ్ కెరీర్‌కు దూరమయ్యింది. పూర్తిగా పర్సనల్ లైఫ్‌పై దృష్టిపెట్టింది. చాలా ఏళ్ల తర్వాత జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్‌లో తన పిల్లలతో కలిసి కనిపించింది ఉదయభాను. అదే ఈవెంట్‌లో మళ్లీ యాంకరింగ్ మొదలుపెడతానని మాటిచ్చింది. అప్పటినుంచి పలు ఈవెంట్స్‌కు యాంకరింగ్ చేస్తూ వస్తున్న ఉదయభాను.. జీ తెలుగులో ప్రసారం కానున్న షోతో హోస్ట్‌గా మరోసారి తన కెరీర్‌ను రీస్టార్ట్ చేయనుంది.


ఎంటర్‌టైన్మెంట్‌కు గ్యాప్ ఉండొద్దు


జీ తెలుగులో త్వరలోనే ‘సూపర్ జోడీ’ అనే డ్యాన్స్ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షోకు సీనియర్ హీరోయిన్ మీనా.. జడ్జిగా వ్యవహరిస్తుందని తెలిసేలా ఒక ప్రోమో విడుదలయ్యింది. ‘‘సోమవారం నుండి శనివారం వరకు మా ఆడవాళ్లకు డైలీ సీరియల్‌లాగా ఇల్లు, పని.. లేకపోతే ఇంట్లో పని. సండే కూడా ఫన్ లేదు.. ఆడడానికి లేదు, చూడడానికి లేదు’’ అంటూ ఈ ప్రోమోలో మీనా.. తన లైఫ్ బోరింగ్ అయిపోయింది అన్నట్టుగా విసుక్కుంటుంది. అప్పుడే తనకు ‘ముత్తు’ సినిమా 200 రోజుల ఫంక్షన్‌కు సంబంధించిన అవార్డ్ కంటపడుతుంది. దానిని చూస్తూ.. ‘‘ఎంటర్‌టైన్మెంట్‌కు గ్యాప్ ఉండొద్దు’’ అంటూ రజినీకాంత్ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటుంది. అలా తనకు డ్యాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు.. అందులో 8 సెలబ్రిటీ జోడీలు ఉండనున్నట్టు ప్రకటిస్తుంది మీనా. ఇదిలా ఉండగా.. ఈ షోకు ఉదయభాను హోస్ట్ అని తెలిసేలా తాజాగా మరో ప్రోమో విడుదలయ్యింది.



అమ్మగా బిజీ..


‘‘అమ్మ చెప్పేది అమ్మగా గెలిస్తేనే అన్నింటిలో గెలిచినట్టు అని. అమ్మను అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. అన్నీ పక్కన పెట్టేశాను. పిల్లలే జీవితం అయిపోయారు. నాకు అమ్మలు అయిపోయారు’’ అంటూ ఉదయభాను.. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్న మాటలతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ‘‘ఆపొద్దు అమ్మ’’ అంటూ తన పిల్లలు చెప్పడంతో ‘సూపర్ జోడీ’తో యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ‘గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్’ అని ట్యాగ్‌తో ఉదయభాను ప్రోమోను విడుదల చేసింది జీ తెలుగు. ఇక ఈ ప్రోమోలో ‘సూపర్ జోడీ’ షో జనవరి 28న లాంచ్ అవుతుందని కూడా రివీల్ చేసింది.



ముగ్గురు జడ్జిలు


‘సూపర్ జోడీ’ షోకు మీనాతో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మరో సీనియర్ నటీమణి శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జిలుగా వ్యవహరించనున్నారు. ఇది సెలబ్రిటీ డ్యాన్స్ షో కావడంతో ప్రేక్షకుల్లో.. దీనిపై ఆసక్తి ఏర్పడింది. ఇంతకీ ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీ జంటలు ఎవరు అనే విషయం ఇంకా రివీల్ అవ్వలేదు. జనవరి 28న ప్రారంభమయ్యే ‘సూపర్ జోడీ’ ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇక ఈ షోతో ఉదయభాను మళ్లీ హోస్ట్‌గా రీఎంట్రీ ఇవ్వడం బాగుందంటూ కొందరు బుల్లితెర ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: శ్రీవల్లి పాటకు అల్లు అర్హ డ్యాన్స్ - క్లిన్ కారాతో కలిసి క్యూట్‌గా స్టెప్పులు