రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (ఎన్‌సీఆర్) శుభవార్త చెప్పింది. నార్త్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (RRC) పలు అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1664 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. దీని ద్వారా ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మెన్, ప్లంబర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనుంది.


ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 1వ తేదీతో ముగుస్తుంది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. మరిన్ని వివరాల కోసం https://www.rrcpryj.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. 



విద్యార్హత, వయస్సు.. 
పదో తరగతి (10+2 విధానంలో) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ విభాగం), వైర్‌మెన్, కార్పెంటర్‌ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సరిపోతుందని నోటిఫికేషన్‌లో తెలిపింది. 2021 సెప్టెంబర్ 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొంది. రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. 


Also read: Telangana Anganwadi Recruitment 2021: టెన్త్ అర్హతతో 109 అంగన్‌వాడీ పోస్టులు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు


భర్తీ చేసే పోస్టులు ఇవే.. 
ఫిట్టర్, వెల్డర్ (జీ & ఈ), మెషినిస్ట్, ఆర్మేచర్ వైండర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ (జనరల్), ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టం మెయింటనెన్స్, మెకానిక్ (డీఎస్ఎల్), వైర్‌మ్యాన్, ప్లంబర్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మల్టీమీడియా & వెబ్ పేజ్ డిజైనర్, మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటనెన్స్ (ఎంఎంటీఎం), క్రేన్ ఆపరేటర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్), స్టెనోగ్రాఫర్ (హిందీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. 



ప్రాంతాల వారీగా ఖాళీలు.. 
ప్రయాగ్‌రాజ్‌ (పీఆర్‌వైజే) డివిజన్‌లో మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌ - 364, ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌ - 339 పోస్టులు ఉన్నాయి. ఝాన్సీ (జేహెచ్ఎస్) డివిజన్‌ - 480, వర్క్‌షాప్‌ ఝాన్సీ - 185, ఆగ్రా (ఏజీసీ) డివిజన్‌ - 296 పోస్టులను భర్తీ చేయనుంది. 


దరఖాస్తు ఫీజు.. 
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (పీడబ్ల్యూడీ), మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ.100 చెల్లించాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. నార్త్ సెంట్రల్ రైల్వేకు చెందిన వెబ్‌సైట్ https://www.rrcpryj.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 


Also Read: NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. వివరాలు ఇవే..