Minister Sridhar Babu Comments on Job Calendar 2024: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ వేదికగా గురువారం మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) జాబ్ క్యాలెండర్‌పై (Job Calendar) కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. తద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ' (Young India Skill University) బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా.. అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని అన్నారు. మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నిస్తూనే ఉంటారని.. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని మంత్రి పేర్కొన్నారు. 


స్కిల్ వర్శిటీ స్థాపన


నిరుద్యోగులు, యువతలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని.. రాష్ట్రంలో 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ' స్థాపనకు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో అన్ని కోర్సులూ 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి  ఉంటాయని.. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. 'స్కిల్ యూనివర్శిటీ యువతకు ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతం ఇస్తుంది. ఈ ఏడాది 2 వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తాం. స్కిల్ వర్శిటీ కోసం ముచ్చర్లలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం.' అని మంత్రి వివరించారు.


'మరో నూతన నగరం'


రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 4 వేల ఎకరాల్లో నగరం రూపుదాలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడారు. రాజధానిలో మరో నూతన నగరం నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇలా 3 నగరాలున్నాయని.. ముచ్చర్ల నాలుగో నగరంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. అక్కడ ఆరోగ్య, క్రీడా హబ్స్‌తో పాటుగా.. మెట్రోతో అనుసంధానిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకూ పలు రంగాలపై నూతన విధానాలు రూపొందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఏర్పాటు చేసే నగరంలో వైద్య సేవల నుంచి ఉపాధి వరకూ అన్నీ లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు.


నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నిరసన


మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం బీఆర్ఎస్ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో బుధవారం మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓ వైపు ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడుతున్నా.. ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అటు, బుధవారం నాటి అంశంపై మాట్లాడేందుకు అవకాశం అడిగిన బీఆర్ఎస్ మహిళా నేతల విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు.


Also Read: Telangana Politcs : తెలంగాణలో రాజుకున్న రాజకీయం - మహిళా ఎమ్మెల్యేల ఏడుపులతో ఎవరికి లాభం ?