UPSC Lateral Entry Notification: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన 'లేటరల్ ఎంట్రీ' నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు యూపీఎస్సీ చైర్మన్‌కు డీఓపీటీ మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. ఈ విధానం ద్వారా వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో కీలక బాధ్యతల్లో నియమిస్తుంటారు. సామాజిక న్యాయం విషయంలో తన వైఖరిలో మార్పు లేదని, లేటరల్ ఎంట్రీ నియామకాల్లో కూడా రిజర్వేషన్ల అవకాశాలను పరిశీలించాలని ప్రధాని ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.


2005 నుంచీ అమలు..
లేటరల్ ఎంట్రీ విధానాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ విధానం అమలవుతోంది. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో సంస్కరణల కోసం వీరప్ప మొయిలీ నేతృత్వంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు 'లేటరల్ ఎంట్రీ' విధానాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తుంటారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాల్సిన పదవుల్లో ఆయా రంగాల నిపుణులను నియమిస్తూ ఉంటారు. అయితే యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‍‌ ద్వారా పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై అన్నిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం ప్రకటనను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది.


రాద్ధాంతం చేసిన రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు..
లేటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా నియామకాలు చేపట్టడం దళిత, ఓబీసీ, ఆదివాసీలపై దాడి అని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవాలని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ వక్రీకరించిన రామరాజ్యం ప్రయత్నిస్తున్నదని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వెనుకబడిన వర్గాలను తొలగించేందుకు ఇది పక్కా ప్రణాళికతో చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సైతం ల్యాటరల్‌ ఎంట్రీ విధానాన్ని తప్పుపట్టారు. రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని, బ్యాక్ డోర్ ద్వారా నియామకాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. ఈ విధానాన్ని యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండో అడ్మినిస్ట్రేటీవ్‌ రిఫార్మ్స్‌ కమిషన్‌ ప్రతిపాదించిందని పేర్కొన్నారు.


మిత్రపక్షాల నుంచీ వ్యతిరేకత..
ఈ లేటరల్ ఎంట్రీ ప్రకటనను కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య లోక్‌ జనశక్తి పార్టీ(రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయమై చిరాగ్‌ పాశ్వాన్‌ స్పందిస్తూ.. ల్యాటరల్‌ ఎంట్రీ ప్రకటన పూర్తిగా తప్పని, ఇందులో ఎలాంటి ‘అయినా, కానీ’లు లేవని కుండబద్ధలు కొట్టారు. తమ పార్టీ ఈ చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ నియామకాలు రిజర్వేషన్‌ నిబంధనలను పాటిస్తూ చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. 


లేటరల్ ఎంట్రీ అంటే?
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్యస్థ, సీనియర్‌ స్థాయి పోస్టుల్లో సాధారణంగా ఐఏఎస్‌ వంటి సివిల్‌ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తుంటారు. అయితే సివిల్‌ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో ఆయా పోస్టుల్లో నియమించడాన్నే ‘లేటరల్‌ ఎంట్రీ’ అంటారు. మూడు సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కాలపరిమితిలో ఒప్పంద ప్రాతిపదికన వీరిని నియమిస్తారు. ఈ పద్ధతిని 2018లో మొదటిసారి అమలు చేశారు. ప్రస్తుతం పలు విభాగాల్లో జాయింట్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌, డిప్యూటీ సెక్రటరీ తదితర 45 పదవులను భర్తీ చేయడానికి యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది.