Bharatiya Janata Yuva Morcha protest today APPSC Office: యువకులకు ఉద్యోగాలు అని మోసపూరిత హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆరోపించింది. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో భాగంగా రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వైఫ్యల్యాలకు నిరసనగా నేడు ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. నేటి ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఎంజీ రోడ్డు మునిసిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న APPSC కార్యాలయం ముట్టడి (BJYM Protest AT APPSC Office)కి నిరుద్యోగులు సైతం భారీగా తరలి రావాలని భారతీయ జనతా యువమోర్చా పిలుపు నిచ్చింది.


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని యువమోర్చా ఆరోపించింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి తొమ్మిది నెలలు గడిచినా కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి (AP Govt Jobs) కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై నిరసన తెలియజేస్తున్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర ప్రభుత్వ వైఫ్యల్యాలకు నిరసనగా ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు.


జాబ్ నోటిఫికేషన్లకు డిమాండ్
ప్రస్తుతంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఏపీపీఎస్సీని యువమోర్చా డిమాండ్ చేస్తోంది. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర సమయంలో నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం అప్పటికి ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల 32 వేల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారని, కానీ వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నిరుద్యోగులను ఆదుకోవడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 


వైఎస్సార్‌సీపీ పేరుతో జాబ్ మేళాలా?
వీలైతే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలి కానీ, వైఎస్సార్‌సీపీ (YSRCP) పార్టీ పేరు చెప్పుకుని.. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో జాబ్ మేళాలు (Job Mela At Universities) నిర్వహించడం సరికాదని సూచించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగాలు లేక, కుటుంబానికి ఆసరాగా నిలవలేక నిరుద్యోగ యువత ఆక్రందన వినపడటం లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా (BJYM) APPSC కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని నేతలు పేర్కొన్నారు.


Also Read: Tirupati Job Mela : తిరుపతి జాబ్ మేళా విజయవంతం, వైసీపీ జాబ్ మేళాలో ఏ స్వార్థం లేదు : ఎంపీ విజయసాయి రెడ్డి


Also Read: AP TET 2022 : ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, జూన్ లో టెట్ నిర్వహించే అవకాశం!