India’s Space Odyssey: 1960ల ప్రారంభంలో మొదలైన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ నుంచి ఇప్పటివరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎన్నో మైలురాళ్లను దాటింది. అమెరికన్ ఉపగ్రహం 'సింకామ్-3' 1964 టోక్యో ఒలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించింది. ఇది గమనించిన భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్.. అంతరిక్ష సాంకేతికత ప్రయోజనాలను గుర్తించారు.


1962లో, అంతరిక్ష పరిశోధన కార్యకలాపాలను విస్తరించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR) ఏర్పాటు చేశారు. 1969 ఆగస్ట్‌లో INCOSPAR స్థానంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఏర్పాటైంది.


1975, ఏప్రిల్ 19న భారతదేశపు మొట్టమొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించారు. 


ISRO సాధించిన ముఖ్యమైన విజయాలు 



  1. శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్ (SITE)

  2. రోహిణి సిరీస్

  3. ఇన్సాట్

  4. GSAT సిరీస్

  5. EDUSAT

  6. HAMSAT

  7. భాస్కర-1

  8. రిసోర్స్‌శాట్ సిరీస్

  9. కార్టోశాట్ సిరీస్

  10. కల్పన-1

  11. ఓషన్‌శాట్ సీరీస్

  12. ఓషన్‌శాట్-1

  13. ఎర్త్‌ అబ్జర్వేషన్ శాటిలైట్ సిరీస్

  14. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్

  15. స్పేస్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్

  16. SARAL

  17. చంద్రయాన్-1

  18. మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)

  19. AstroSat

  20. చంద్రయాన్-2


ISRO భవిష్యత్తు మిషన్లు


ఆదిత్య ఎల్‌-1, చంద్రయాన్‌-3 మిషన్‌, గగన్‌యాన్‌ మిషన్‌, వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌, నిసార్ మిషన్‌ వంటి భవిష్యత్‌ ఉపగ్రహ మిషన్లపై ఇస్రో పనిచేస్తోంది.


ఆదిత్య L-1 అనేది సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి తయారుచేసిన కరోనాగ్రఫీ అంతరిక్ష నౌక. చంద్రయాన్-3.. చంద్రుడిపై అన్వేషించడానికి ఇస్రో తయారు చేసిన మూడవ మిషన్, ఇది చంద్రయాన్-2 రిపీట్ మిషన్. అయితే, దీనికి ఆర్బిటర్ ఉండదు.


గగన్‌యాన్ ప్రోగ్రామ్ తక్కువ-భూ కక్ష్యకు మానవ అంతరిక్ష యాత్రలను చేపట్టేందుకు, స్వదేశీ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తోన్న మిషన్.


గగన్‌యాన్ ప్రోగ్రామ్ కింద మూడు విమానాలు లో ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపిస్తారు. వీటిలో రెండు మానవరహిత విమానాలు, ఒకటి మానవ సహిత పయనం.


రాబోయే మిషన్లు భారత సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచనున్నాయి. శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందిస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


వాతావరణం, కమ్యూనికేషన్, టెలి-ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్ వంటి వివిధ రంగాలలో మానవజాతి అభివృద్ధికి ఇస్రో విశేష కృషి చేస్తోంది.


ఇస్రో ప్లాన్ చేసిన మిషన్లు


ఆదిత్య L1


ఆదిత్య L1 సూర్యునిపై అధ్యయనం చేయనున్న మొదటి భారతీయ మిషన్‌. 400 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని సూర్యుడు-భూ వ్యవస్థ లాగ్రాంజియన్ పాయింట్ 1 (L1) చుట్టూ ఒక హాలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. L1 అత్యంత ముఖ్యమైనది. L1 భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది.


L1 చుట్టూ ఆదిత్య L1 నిలుస్తుంది. కనుక ఇది సూర్యుడిని నిరంతరం వీక్షించగలదు. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్‌తో సహా మొత్తం ఏడు పేలోడ్‌లతో ఉపగ్రహం అమర్చబడి ఉంటుంది.


సూర్యుని కరోనాను గమనించడమే మిషన్ ప్రధాన లక్ష్యం. కరోనా అన్న పదాన్ని ఇక్కడ ఏదైనా నక్షత్రానికి సంబంధించిన బయటి పొరలను వివరించడానికి ఉపయోగిస్తారు. సూర్యునిలో జరుగుతున్న డైనమిక్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఈ మిషన్ 2022 చివరలో లాంచ్ కానుంది.


చంద్రయాన్-3


చంద్రయాన్-3.. చంద్రుడిపై అన్వేషించడానికి ఇస్రో తయారు చేసిన మూడవ మిషన్, ఇది చంద్రయాన్-2 రిపీట్ మిషన్. అయితే, దీనికి ఆర్బిటర్ ఉండదు.


చంద్రయాన్-3ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) మార్క్ III రాకెట్‌పై ప్రయోగించనున్నారు. 2019లో చంద్రయాన్-2కు చెందిన విక్రమ్ ల్యాండర్ తిరిగిన చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని అదే ల్యాండింగ్ సైట్‌ను చంద్రయాన్-3 కూడా లక్ష్యంగా చేసుకుంటుంది. మిషన్‌లో భాగంగా ప్రారంభించే లూనార్ రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఇక్కడే అన్వేషణ చేయనున్నాయి. ఈ మిషన్‌ను 2022 ఆగస్టులో ప్రారంభించాలని భావిస్తున్నారు.


గగన్‌యాన్ 1


గగన్‌యాన్ ప్రోగ్రామ్ భారతదేశపు మొట్టమొదటి  మానవసహిత అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మిషన్‌లో భాగంగా తక్కువ భూ కక్ష్యలోకి మనుషులను పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.


రెండు టెస్ట్ ఫ్లైట్‌లలో గగన్‌యాన్ 1 మొదటిది. ముగ్గురు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న అంతరిక్ష నౌకను 2022 చివరిలో అంతరిక్షంలోకి పంపాలని భావిస్తున్నారు.


గగన్‌యాన్‌ 2


గగన్‌యాన్ రెండవ అన్‌క్రూడ్ మిషన్ 2022 చివరిలో ప్రయోగించనున్నారు. ఈ పరీక్షలో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు.. అచ్చం మనిషిలాగే ప్రవర్తించే హాఫ్ హ్యూమనాయిడ్​ రోబో 'వ్యోమ మిత్ర'ను రూపొందించింది ఇస్రో. వ్యోమమిత్రను పరీక్షించిన ఆరునెలల అనంతరం మరోమారు మానవ రహిత గగన్​యాన్​ ప్రయోగం చేపట్టనుంది. మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టే ముందు అంతరిక్ష నౌక వ్యవస్థలను అధ్యయనం చేయడం ఈ మిషన్‌ లక్ష్యం.


నిసార్


భూ పరిశోధనకు ఉపకరించేందుకు నిసార్‌ మిషన్‌ను ప్రారంభించనున్నారు. భూమిపై సెంటీమీటరు కంటే తక్కువ వైశాల్యాన్ని కూడా నిసార్ ద్వారా కొలవవచ్చని పేర్కొంది నాసా. నిసార్‌ను నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు 2014 సెప్టెంబరులో ఒప్పందం చేసుకుంది ఇస్రో. అందుకే పేరు కలిసివచ్చేలా ఈ వ్యవస్థకు 'నిసార్' అనే పేరు పెట్టారు. 2022లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి ప్రయోగించే ఉపగ్రహంలో నిసార్‌ను ఉపయోగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.


గగన్‌యాన్ 3


ఈ మిషన్‌లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం కోసం ఇప్పటికే నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు. వీరికి శిక్షణ కూడా ఇస్తున్నారు. భారత వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యా సాయంతో 1984లో తొలిసారి అంతరిక్షం చేరగా ప్రస్తుతం స్వదేశీ పరిజ్ఞానంతోనే భారత వ్యోమగాములు రోదసిలోకి వెళ్లనున్నారు. ఇది సక్సెస్ అయితే ఈ ఫీట్ చేపట్టిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. సోవియట్ యూనియన్, అమెరికా, చైనా ఇప్పటికే వ్యోమగాములను రోదసీకి పంపింది.


శుక్రయాన్ 1


శుక్ర గ్రహంపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టే మిషన్ శుక్రయాన్ 1. శుక్ర గ్రహం ఉపరితలాలు, నిస్సార ఉపరితలాలతో పాటు వాతావరణ తీరుతెన్నులపై పరిశోధన చేపట్టనుంది ఇస్రో. ఉపగ్రహ ప్రయోగం కోసం జీఎస్​ఎల్​వీ ఎంకే 2 రాకెట్​ను ఉపయోగించనుంది. శుక్ర గ్రహానికి 500x60 వేల కిలోమీటర్ల కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనుంది. 2024 డిసెంబర్‌లో శుక్రయాన్ 1 లాంచ్ కానుంది.


మంగళ్‌యాన్ 2


మంగళ్‌యాన్-2 లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్ -2ను 2025లో లాంచ్ చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. అరుణ గ్రహానికి భారత్​ చేపట్టబోయే ఈ ప్రయోగం కూడా 'ఆర్బిటర్ మిషన్​' అని ఇస్రో పేర్కొంది.


​ రోవర్​.. అంగారకుడిపై దిగి అక్కడి నమూనాలను భూమిపైకి పంపిస్తుంది. ఆర్బిటర్​.. మార్స్​ కక్ష్యలో తిరగుతూ సమాచారం అందిస్తుంది.