ప్రపంచదేశాలను మూడేళ్ళ పాటు గడగడాలాడించిన కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. భారత్ లో రోజు రోజుకీ కొత్త కేసులు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ కొత్త వేరియంట్ XBB.1.18 వేగంగా విస్తరిస్తోంది. దీన్నే ఆర్క్టురస్ అని పిలుస్తున్నారు. అన్ని దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కోరల్లో చిక్కుకుపోయింది. సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఆర్క్టురస్ అనేది అత్యంత వేగంగా వ్యాపిస్తున్న అంటువ్యాధి. ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ ఇది. ప్రస్తుతం యూఎస్ లో అత్యంత ప్రబలంగా ఉన్న వేరియంట్ ఇదే మార్చి నెలలో ఇది అమెరికాలో 1.1 శాతం కేసులను కలిగి ఉంది. కానీ ఏప్రిన్ మూడో వారం నాటికి ఇది 19. 8 శాతానికి చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త వేరియంట్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనేది అర్థం అవుతోంది.


XBB.1.5 తర్వాత రెండవ అత్యంత ప్రబలమైన సబ్ వేరియంట్ ఇదే. సుమారు 73.6 శాతం కేసులను కలిగి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్క్టురస్ కేసుల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది. యూఎస్ తో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, లిబియా, ఇరాన్, కువైట్, ఖతార్ సహా 33 దేశాలలో ఈ సబ్ వేరియంట్ కేసులు కనుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. అయితే ఇది భారతదేశంలో ఎక్కువగా ఉంది. కొత్త వేరియంట్ లక్షణాలు కూడా కొత్తగా ఉన్నాయి. సాధారణంగా కోవిడ్ లక్షణాలంటే జ్వరం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు అధికంగా కనిపించేవి. కానీ ఈ ఆర్క్టురస్ సోకితే కళ్ళు గులాబీ రంగులోకి మారడం, అధిక జ్వరం కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.


భారత్ లో ఇలా..


పింక్ ఐ అంటే కండ్ల కలక. చిన్న పిల్లల్లో ఎక్కువగా కండ్ల కలక ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కంట్లో నుంచి ఎక్కువగా నీరు కారడం, కళ్ళు దురదగా ఎర్రగా మారిపోవడం ఈ కొత్త వేరియంట్ లక్షణాలు. ఈ సబ్ వేరియంట్ ఏడు నెలలో భారతదేశంలో మరోసారి కోవిడ్ విశ్వరూపం చూపించబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి 30 న 13,509 కేసులు నమోదు కాదా అప్పటి నుంచి ఇప్పటి వరకు 61 వేల కేసులు నమోదయ్యాయి.


ఆర్క్టురస్ ఎలా వచ్చింది?


ఆర్క్టురస్ అనేది వేరియంట్ XBB, BA.2 సబ్‌లినేజ్‌ల నుంచి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 600 ఓ‌మిక్రాన్ సబ్ వేరియంట్లలో ఇదీ ఒకటి. ఈ సబ్ వేరియంట్ కేసులు మొదటిసారిగా జనవరిలో కనుగొన్నారు.


లక్షణాలు


అమెరికన్ ఆకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం కండ్ల కలక ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తుంది. పిల్లలకు దురద, కళ్ళు ఎర్రగా ఉంటే తల్లిదండ్రులు భయపడకుండా ముందుగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించడం ఉత్తమం. సాధారణ కోవిడ్ కి జ్వరం వస్తుంది. కానీ ఈ కొత్త వేరియంట్ కి జ్వరం అధిక మోతాదులో ఉంటుంది. పెద్దవారిలో 103 డిగ్రీలు లేదా అంత కంటే ఎక్కువ వస్తుంది. మూడు నెలలు నుంచి మూడేళ్ళ పిల్లలకు అయితే 100.4 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. కండ్ల కలకతో పాటు జ్వరం వచ్చినట్టయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ప్రోటీన్ పొందటం కోసం గుడ్లు తినాల్సిన పని లేదు, వీటిని తినొచ్చు