వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంది.


కరోనా సెకండ్ డోసు తీసుకుని 9 నెలలు దాటిన 18 ఏళ్ల పైబడిన వారు ఈ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 


టీకా ధర


ఇక నుంచి కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా ధరలు రూ.225కు తగ్గించారు. కొవిషీల్డ్‌ రూ.600, కొవాగ్జిన్‌ రూ.1200 నుంచి రూ.225కే ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి


కేంద్ర ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించిన తర్వాత వ్యాక్సిన్ ధరలు తగ్గిస్తున్నామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా, భారత్‌ బయోటెక్‌ కోఫౌండర్‌ సుచిత్ర ఎల్లా ట్వీట్‌ చేశారు. దీంతో 18 ఏళ్లు నిండిన అందరి కోసం బూస్టర్‌ డోసులు ఆదివారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి.


అయితే టీకా ధరపైన అదనంగా రూ.150 వరకు సర్వీస్ ఛార్జ్ వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఆరోగ్య సంఖ్య అవకాశమిచ్చింది.


హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు, 60 ఏళ్లు దాటిన పౌరులు నేటి నుంచి ఏ వ్యాక్సినేషన్ కేంద్రంలోనైనా ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వీరికి ఉచితంగా ప్రికాషన్ డోసు అందిస్తోంది ప్రభుత్వం.


అర్హత 


18 ఏళ్లు పైబడి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు తీసుకొని 9 నెలలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హలని కేంద్రం ప్రకటించింది. ఫస్ట్, సెకండ్ డోసు కోసం తీసుకున్న టీకానే ప్రికాషన్ డోసుకు ఇస్తారు.






స్లాట్ ఇలా బుక్ చేయండి


ప్రికాషన్ డోసు కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి తీసుకోవచ్చు. ప్రికాషన్ డోసు కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇప్పటికే కొవిన్‌ యాప్‌లో రిజిస్టర్ అయిన వారు ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు. సెకండ్ డోసు తీసుకున్న 9 నెలలకు ఆ యాప్‌లో స్లాట్ బుకు చేసుకుంటే చాలు.


వ్యాక్సినేషన్


ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.70 కోట్లకు చేరింది. 4,18,345 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 79,38,47,740 కరోనా పరీక్షలు చేశారు.