Suriya Request To Fans: తమిళ స్టార్ హీరో సూర్య సినీ అభిమానులు కీలక సూచన చేశారు. కార్తీ హీరోగా నటించిన ‘మెయ్యజగన్’ అనే సినిమా వేడుకలో పాల్గొన్న ఆయన సినిమాను సినిమా లాగే చూడాలని విజ్ఞప్తి చేశారు. బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సినిమా రివ్యూల గురించి అసలే ఆలోచించవద్దన్నారు. ‘‘సినిమా అభిమానులు ఎవరైనా సరే, ఏ హీరో ఫ్యాన్స్ అయిన ఫర్వాలేదు, సినిమాను కేవలం సినిమా లాగే చూడండి. సినిమాలోని స్టోరీ, కామెడీ, ఎమోషన్స్, సంగీతాన్ని ఎంజాయ్ చేయండి. అంతేకానీ, సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా సాధిస్తోంది? ఎంత సాధించే అవకాశం ఉంది? అనే విషయాలను పట్టించుకోకండి. సినిమా అభిమానులుగా సెలబ్రేట్ చేసుకోండి. సినిమా రివ్యూల జోలికి అస్సలు వెళ్లకండి” అని సూర్య కోరారు. ప్రస్తుతం సూర్య కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఆయన వ్యాఖ్యలకు సపోర్టు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఆయా సినిమాల రివ్యూలు, బాక్సాఫీస్ వసూళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకుని సినిమాలు చూస్తున్నారని, సినిమాను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సూర్య చెప్పినట్లుగా కేవలం సినిమాను సినిమాగా చూసినప్పుడే ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు.






కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మెయ్యజగన్‌’ 


ఇక ‘మెయ్యజగన్‌’  సినిమా సూర్య తమ్ముడు కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది. తమిళంలో ‘96’ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2D ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో విడుదల కాబోతోంది. ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకుండా  మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హార్ట్ టచింగ్ స్టోరీతో ఈ మూవీని తీర్చిదిద్దారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాను చూసి సూర్య భావోద్వేగానికి గురైనట్లు కార్తి వెల్లడించారు. ఈ సినిమాను ప్రేక్షకులకు ఈ సినిమా ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఈ మూవీ తమిళంలో 27న విడుదల అవుతుండగా, తెలుగులో 28న ప్రేక్షకుల ముందుకురానుంది. 


‘కంగువ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య


అటు సూర్య ప్రస్తుతం కంగువ అనే సినిమాలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టూడియోగ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఓ ఐలాండ్ లో రెండు గిరిజన తెగల మధ్య జరిగిన పోరాట కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాబీ డియోల్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నారు. నవంబర్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. 


Also Read: కుర్చీలు విరగొట్టిన ఫ్యాన్స్... 'దేవర' ప్రీ రిలీజ్ క్యాన్సిల్‌ అయ్యాక రచ్చ రచ్చ