'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీనికి ప్రధాన కారణం భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల అత్యుత్సాహం. త్వర త్వరగా స్టేజ్ దగ్గరకు చేరుకోవాలని హోటల్ లోపలికి తోసుకుంటూ వెళ్లారు. దాంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. నోవాటెల్ హోటల్ ప్రాపర్టీస్ డామేజ్ అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేయడం మినహా మరొక మార్గం లేకుండా పోయింది. అయితే... ఈ ఫంక్షన్ దగ్గర కొంత మంది అభిమానులు రచ్చ రచ్చ చేశారు. 


క్యాన్సిల్ అని తెలిశాక కుర్చీలు విరగ్గొట్టారు!
'దేవర' ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అని స్టేజి మీదకు వచ్చిన పోలీసులు అనౌన్స్ చేయడంతో పాటు బౌన్సర్స్ సహాయంతో హాల్ లోపల నుంచి ఓ అభిమాని తర్వాత మరొకరిని బయటకు పంపించారు. ఒక దశలో పోలీసులకు, అభిమానులకు మధ్యన ఘర్షణ పూరిత వాతావరణం కూడా ఏర్పడింది. పోలీసుల మీదకు కొందరు అభిమానులు దూసుకు వచ్చారని ప్రత్యక్షంగా చూసిన కొందరు చెబుతున్నారు. 


మరికొందరు అయితే బయటకు వచ్చేటప్పుడు కుర్చీలను విసిరేస్తూ విరగకొట్టారు. ఈ పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదని, ఎన్టీఆర్ అభిమానులకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉందని మరి కొంతమంది అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.










శ్రేయాస్ మీడియా సంస్థపై ఫ్యాన్స్ ఆగ్రహం!
'దేవర' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహణలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా వైఫల్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనపడిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్ చేయడం కోసం బుక్ చేసిన హాల్ కెపాసిటీకి మించి పాసులు జారీ చేశారని, తమకు పాసులు రావడంతో దూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో అభిమానులు వచ్చారని, వారందరూ ఫంక్షన్ హాల్ లోపలికి ఒక్కసారిగా దూసుకు వెళ్లడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయని, కెపాసిటీకి మించి పాసులు జారీ చేయాల్సిన అవసరం ఏముందని శ్రేయాస్ సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






Also Read: బ్రేకింగ్ న్యూస్... 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ - మెయిన్ రీజన్స్ ఇవే



అందరినీ పంపించేసి ఈవెంట్ చేస్తారా?
లేదంటే సోమవారం ప్రెస్ మీట్ పెడతారా?
'దేవర' ఫంక్షన్ జరగదని అభిమానులతో పాటు అందరూ ఒక క్లారిటీ వచ్చేశారు. అయితే... ఈవెంట్ జరిగే అవకాశాలు ఇప్పటికీ తీసి పారేయలేం అంటున్నారు. సినిమా యూనిట్ సన్నిహిత వర్గాలు కొందరు. అభిమానులు అందరినీ పంపించేసి హాల్ ఖాళీ అయిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసి ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉంది అని ప్రస్తుతానికి వినబడుతున్న ఒక గుసగుస. మరొక ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు కొరటాల శివతో పాటు నిర్మాతలు కలిసి సోమవారం ఒక ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలకు సమాచారం అందుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.


Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే