మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు బ్రేకింగ్ న్యూస్... ఒక విధంగా ఇది బ్యాడ్ న్యూస్ కూడా! తమ ఫేవరెట్ హీరోని చూడాలని 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరకు వెళ్లిన ప్రేక్షకులకు, ఆదివారం సాయంత్రం సరదాగా ఫ్యామిలీతో కలిసి టీవీల్లో లైవ్ చూస్తూ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్న వారికి పెద్ద షాక్ తగిలింది. 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. దీనికి కారణం 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరకు వెళ్లిన ఫ్యాన్స్ చేసిన అత్యుత్సాహం కారణం.


ఈవెంట్ క్యాన్సిల్ చేయడానికి కారణం ఏమిటి?
ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో 'దేవర' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రెండేళ్లకు ఆయన అభిమానుల ముందుకు వస్తుండడంతో నేరుగా చూసేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న నోవాటెల్ హోటల్ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు వెళ్లారు. తమ దగ్గర పాసులు లేకున్నా సరే ఈవెంట్ జరిగే ఆడిటోరియంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో హోటల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. అంతే కాదు... బారికేడ్లు కొన్ని విరిగిపోయాయి. పరిస్థితి కంట్రోల్ తప్పింది. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను కూల్ గా కూర్చోబెట్టడం ఎవరి తరం కావడం లేదని వినిపిస్తోంది.


చేతులెత్తేసిన హోటల్ సిబ్బంది... వద్దంటోన్న యాజమాన్యం
అభిమానులు తాకిడికి అద్దాలు ధ్వంసం కావడం, హోటల్ ప్రాంగణంలో ఆస్తి నష్టం వంటివి జరగడంతో ఈవెంట్ సజావుగా చేసే పరిస్థితి లేదని నోవాటెల్ హోటల్ సిబ్బంది చేతులు ఎత్తేసారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈవెంట్ నిర్వహించడం మంచిది కాదని దేవర చిత్ర బృందానికి, ఈవెంట్ నిర్వహణ సంస్థ శ్రేయాస్ మీడియాకి స్పష్టం చేశారట. హోటల్ యాజమాన్యం సైతం తాము ఈవెంట్ చేయలేమని వివరించారని తెలిసింది. 


పోలీసులది సైతం అదే మాట... ఈవెంట్ క్యాన్సల్!
ఎన్టీఆర్ కోసం ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానుల అత్యుత్సాహం చూసిన తర్వాత పోలీసులు సైతం ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తే మంచిది అని స్పష్టం చేశారని ప్రాథమిక సమాచారం అందింది. దేవర హీరో ఎన్టీఆర్ ఇతర చిత్ర బృంద సభ్యులు ఈవెంట్ దగ్గరకు ఇంకా రాలేదని, పరిస్థితి ఇప్పుడే అదుపు తప్పితే... వాళ్లు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించుకోమని స్పష్టం చేశారట. అయితే ఈవెంట్ నిర్వహణకు ముందు నుంచి ప్లానింగ్ చేశామని, హీరో రావడానికి రెడీగా ఉన్నారని, ఆయన వచ్చి ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతారని అటు హోటల్ యాజమాన్యాన్ని, ఇటు పోలీసులను శ్రేయాస్ మీడియా సంస్థ రిక్వెస్ట్ చేసింది. అయినా సరే ఫలితం దక్కలేదు.


Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే



లోపలికి ఎవరూ రాలేరు... బయటకు వెళ్లలేరు!
అద్దాలు ధ్వంసం అయిన తర్వాత నోవాటెల్ యాజమాన్యం అక్కడి పరిస్థితిని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. సాధారణంగా ఈ తరహా ఈవెంట్స్ జరిగేటప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి.‌ అనుమతులు ఇచ్చిన తర్వాత కొంతమంది పోలీసులను అక్కడ ఉంచడం కూడా ఎప్పుడు జరిగేది. అయితే హోటల్ సిబ్బంది పరిస్థితి వివరించిన తర్వాత ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ నోవాటెల్ దగ్గరకు చేరుకుంది. పరిస్థితిని గమనించిన తర్వాత... బయట ఉన్న వాళ్ళు హోటల్ లోపలికి వెళ్లడానికి లేకుండా గేట్లు క్లోజ్ చేశారు. అదే విధంగా ఆడిటోరియం లోపల ఉన్న అభిమానులు బయటకు రాకుండా డోర్లు లాక్ చేశారు. తొలుత ఎల్ఈడి స్క్రీన్లు ఆఫ్ చేసి... సాధారణ లైట్లు ఆన్ చేశారు. పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత ఆడిటోరియం లోపల ఉన్న అభిమానులను ఒక్కొక్కరిగా మెల్లగా బయటకు పంపించారు.‌ పోలీసులు స్టేజి మీదకు వచ్చి క్యాన్సిల్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఒకవేళ ఏమైనా జరిగితే తప్ప ఈవెంట్ జరిగే అవకాశాలు లేవు.


Also Readఊరమాస్ యాక్షన్ - గూస్‌బంప్స్ ఇచ్చేలా ‘దేవర’ రిలీజ్ ట్రైలర్!