తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ నటుడు మంచు విష్ణు ఎంత కామెడీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరితో కలిసి మెలిసి ఉంటూ ఫుల్ ఫన్ చేస్తుంటారు. ఆయన వచ్చారంటే ఎంత సీరియస్ మ్యాటర్ అయినా, ఫన్ తో తేలికగా మారిపోతుంది. తాజాగా మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా పెట్టి ఓ పోస్టు కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలు కుప్పలుగా రూ.2 వేల నోట్లు- మంచు విష్ణు


తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేల నోట్ల చలామణి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను రద్దు చేస్తున్నట్లు RBI ప్రకటన చేసింది. ప్రస్తుతం 10.8 శాతం నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2,000 నోట్లను మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉన్న బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలు కుప్పలుగా రూ.2 వేల నోట్లు ఉన్నాయంటూ మంచు విష్ణు ఓ ట్వీట్ చేశారు. ఈమేరకు ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. ‘‘వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఫొటో తీసిన రూ. 2 వేల నోట్ల కట్టల ఫోటో ఇది. ఇప్పుడు ఆయన వీటిని ఏం చేస్తాడో’’ అంటూ ట్వీట్ చేశారు.






మంచు విష్ణు ట్వీట్ పై వెన్నెల కిశోర్ రియాక్షన్ ఇదే!


మంచు విష్ణు ట్వీట్ పై వెన్నెల కిశోర్ స్పందించారు. ‘‘హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ ను చంపేసినట్లు, నా మీద పడ్డారేంటి?” అనే ఆహుతి ప్రసాద్ డైలాగ్ ను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ పోస్టు మీద ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ నువ్వేం చేస్తావో, తను కూడా అదే చేస్తాడు” అంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “ఆ డబ్బుతో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడు” అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. “కొద్ది సేపటి క్రితమే రూ. 2 వేల నోట్లను రూ.500 నోట్లుగా మార్చాడు” అంటూ బీరువా నిండుగా పేర్చిన రూ. 500 ఫోటోను మరికొంత మంది నెటిజన్స్ పోస్టు చేశారు. అటు మరికొంత మంది నెటిజన్లు మాత్రం మంచు విష్ణు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తమ్ముడికి బర్త్‌ డే విషెస్ చెప్పవు. కానీ, కామెడీలు చేస్తున్నావంటూ ట్రోల్ చేస్తున్నారు.


















Read Also: అప్పుడు నోట్ల రద్దు, ఇప్పుడు 2 వేలు రద్దు - ‘బిచ్చగాడు 3’ వస్తే కరెన్సీ నోట్లే లేకుండా చేస్తారేమో? ఈ మీమ్స్ చూశారా?