Virupaksha : మెగా హీరో సాయిధరమ్ తేజ్ మూవీ 'విరూపాక్ష' ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. గత వారాంతంలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్స్‌ను అందుకుంది. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన లాంగ్ రన్‌ను పొందింది. ఈ చిత్రం విడుదలకు ముందు అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అద్భుతమైన కంటెంట్ కారణంగా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. అయితే తాజాగా ‘విరూపాక్ష’ మరో మైలురాయిని చేరుకుంది.


వీక్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని మెయింటెయిన్ చేసిన 'విరూపాక్ష'.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే రూ. 40 కోట్ల షేర్ సాధించిన తొలి సినిమాగా ‘విరూపాక్ష’ నిలిచింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలు వచ్చినా... అవి ప్లాఫ్ కావడం 'విరూపాక్ష'కు అడ్వాంటేజ్‌గా మారింది. శుక్రవారం నుంచి పాన్ ఇండియా లెవల్‌లో ‘విరూపాక్ష’ విడుదల కానుంది. ఇప్పటికే తమిళనాడులో ఏర్పాటుచేసిన ప్రివ్యూస్‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. దీంతో ‘కాంతార’ తరహాలోనే కాసుల వర్షం కురిపిస్తుందనే ఆశతో దర్శకనిర్మాతలు ఉన్నారు.


'విరూపాక్ష'కథేంటంటే..


ఆధ్యాత్మిక గ్రామం రుద్రవనంలో తెరకెక్కినట్టుగా చూపించిన ఈ సినిమాలో.. సూర్య అనే వ్యక్తి (హీరో సాయి ధరమ్ తేజ్) తన కుటుంబాన్ని కలవడానికి తల్లితో కలిసి వస్తాడు. ఆ తర్వాత నందిని(సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. వారి మధ్య ప్రేమ చిగురించడం మొదలవుతుంది. అంతలోనే అకస్మాత్తుగా ఆ గ్రామ ప్రజలు అనుమానాస్పదంగా వివిధ స్థితులలో ఒకరి తర్వాత ఒకరు చంపబడతారు. సూర్య.. ఆ గ్రామంలోని రహస్య మరణాల వెనుక ఉన్న మిస్టరీని చేధించడంపై దృష్టి సారించడం ప్రారంభిస్తాడు. అతను ఈ రహస్యాన్ని ఎలా ఛేదించాడనేది ఈ కథ సారాంశం.


సినిమా రిలీజ్ కు ముందు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న విరూపాక్ష.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను అదరగొడుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. సీక్వెల్ కూడా ఉంటుందని ఇటీవలే సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు హీరోయిన్‌లలో తన క్రష్ ఎవరు అని ఒకరు అడగగా, సమంత అంటూ చెప్పుకొచ్చారు. రోజురోజుకూ ఊహించని కలెక్షన్లను రాబడుతూ.. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతోంది. అంతే కాదు ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘వీర సింహా రెడ్డి’మూవీ రెండవ రోజు సాధించిన వసూళ్ల కంటే విరూపాక్ష రెండో రోజు ఎక్కువ వసూళ్ళని సాధించినట్టు తెలుస్తోంది. ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి రెండవ రోజు రూ.5 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ రాగా...‘విరూపాక్ష’ మూవీ రెండో రోజు ఏకంగా 5 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్‌ను రాబట్టి.. బాలయ్య రెండో రోజు రికార్డ్స్ ను బద్దలు కొట్టింది.


Read Aslo: ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేస్తోంది, నేరుగా థియేటర్లలోనే విడుదల - తెలుగు రాష్ట్రాల్లో నయా రికార్డ్!


ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అజయ్, రాజీవ్ కనకాల, సాయి చంద్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 21, 2023న థియేటర్లలో విడుదలైంది. విరూపాక్ష చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్ నిర్మించారు. బి అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.