నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. దాదాపు అరడజను ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మరికొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ లు పట్టుకొని బాలయ్య చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా.. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమాను పూర్తి చేసిన బాలయ్య తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు. 


ఈ సినిమాను నిజజీవిత సంఘటనలతో తెరకెక్కించనున్నారు దర్శకుడు. ఇందులో భాగంగానే మొన్నామధ్య గోపీచంద్ మలినేని ప్రకాశం జిల్లాకు వెళ్లి.. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకి సంబంధించిన వార్తా పత్రికలను తిరగేసి మరీ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. దీనికోసం చాలా మంది తారలను సంప్రదించారు కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. 


Also Read : Prakash Raj Surgery : 'ది డెవిల్ ఈజ్ బ్యాక్..' షూటింగ్ కి రెడీ..


ఇప్పుడు సినిమాలో విలన్ కోసం కోలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. తమిళనాట హీరోగా ఎన్నో సినిమాలు చేసిన విజయ్ సేతుపతి.. పాత్ర నచ్చితే విలన్ గా కూడా నటిస్తుంటారు. ఈ ఏడాది 'ఉప్పెన' సినిమాలో విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు దీంతో టాలీవుడ్ మేకర్స్ చాలా మంది విజయ్ సేతుపతిని తమ సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా బాలయ్య సినిమాలో విలన్ గా నటించమని విజయ్ సేతుపతిని అడిగారట. 


ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ఓ కొలిక్కి వస్తే విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికైతే విజయ్ సేతుపతి కాల్షీట్స్ ఖాళీగా లేవు. మరి బాలయ్య కోసం ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారేమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. 


 



Also Read : Pushpa The Rise : 'దాక్కో దాక్కో మేక' సాంగ్ ప్రోమో.. అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్..