అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను షురూ చేసింది చిత్రబృందం. ఆగస్టు 13న సినిమాలో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.  'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ సారథ్యంలో ఐదు భాషల్లో విశాల్‌ దడ్లానీ (హిందీ), విజయ్‌ ప్రకాశ్‌ (కన్నడ), రాహుల్‌ నంబియార్‌ (మలయాళం), శివమ్‌ (తెలుగు), బెన్నీ (తమిళం) అనే ఐదుగురు ప్రముఖ గాయకులు ఆలపించనున్నారు.


తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ ఊరమస్ గెటప్ లో కనిపించి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక ఆగస్టు 13న విడుదల కాబోయే పాట ఇంకే రేంజ్ లో ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. 

 

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక రెండో పార్ట్ కు సంబంధించిన సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.