ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం ఇళ్లు కట్టడానికి నిధులు ఇస్తోంది. గత మూడేళ్ల నుంచి అన్ని రాష్ట్రాలూ పోటీ పడి తమ రాష్ట్రాల్లోని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నాయి. 2022 కల్లా దేశంలో ఇళ్లు లేని పేదలే ఉండకూడదన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇళ్ల నిర్మాణం విషయంలో అసలు ఆసక్తి లేనట్లుగా వ్యవహరిస్తోంది. పేదలకు ఇళ్లు కట్టించడానికి గత మూడేళ్లలో చేసింది శూన్యం . కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు అంటే ఐదు ఇళ్లు మాత్రమే కట్టించ్చారని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం పక్కా రికార్డులు బయట పెట్టింది .


రెండేళ్లలో దేశవ్యాప్తంగా 55 లక్షల ఇళ్ల నిర్మాణం.. ఏపీలో కట్టింది 5 ఇళ్లు..తెలంగాణలో సున్నా..! 


2018-19 ఆర్థిక సంవత్సరంలో 18677  ఇళ్లను గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కట్టించి ఇచ్చింది. ఆ ఆర్థిక సంవత్సంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.  మేలో ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  ఆ ఆర్థిక సంవత్సరం అంటే 2019-20లో  ప్రభుత్వం కేవలం ఐదు అంటే ఐదు ఇళ్లు మాత్రమే నిర్మించింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఆ ఐదు ఇళ్లను కూడా ఏపీ సర్కార్ గ్రామీణ ప్రాంత పేదలకు కట్టించి ఇవ్వలేదు. ఈ విషయాలను కేంద్రం లోక్‌సభకు తెలియచేసింది. 2019-20లో దేశవ్యాప్తంగా 21 లక్షలకుపైగా ఇళ్లను వివిధ రాష్ట్రాలు కేంద్రం సాయంతో నిర్మించుకున్నాయి. 2020-21లో  వీటి సంఖ్య కొద్దిగా తక్కువగా 34 లక్షలు. అంటే రెండేళ్లలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత పేదలకు 55 లక్షల ఇళ్లు కట్టిస్తే అందులో ఏపీలో గ్రామీణ ప్రాంత ప్రజలకు దక్కింది కేవలం ఐదు అంటే ఐదు మాత్రమే. తెలంగాణలో ఆ ఐదు కూడా కట్టలేదు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పేదలకు పీఎంఏవై పథకం కింద తెలంగాణ ప్రభుత్వం నిర్మించడానికి ఆసక్తి చూపలేదు. 



ఏపీలో ఇళ్ల స్థలాలు... తెలంగాణలో డబుల్‌బెడ్‌రూంలే కారణం..!  


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల నిర్మాణాలను .. ఎక్కడ ఉంటేఅక్కడ నిలిపివేసింది. ఫలితంగా టిడ్కో ఇళ్లన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కొన్ని లక్షల ఇళ్లను పంపిణీ చేయలేదు. అయితే అవన్నీ కాదని..  తాము అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి... ప్రత్యేకంగా ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఈ రెండేళ్ల పాటు లబ్దిదారులను గుర్తించడం.. ఇళ్ల స్థలాలు సేకరించడం... వంటివి చేసింది. ఇటీవలే అందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి... శంకుస్థాపనలు ప్రారంభించింది. ఈ ఏడాది 15 లక్షల ఇళ్లు కడతామని ప్రభుత్వం చెబుతోంది. అంటే... రెండేళ్లలో ఐదు ఇళ్లే కట్టినా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం రికార్డులు బద్దలు కొడతామని ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లు అగ్గిపెట్టేలా ఉంటాయని అవి తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా ఉండవని చెబుతూ.. సొంత ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తోంది. పెద్ద ఎత్తున ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవలే వాటిని లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పథకం లెక్కలోకి రావడం లేదు.  


కేంద్రం కన్నా మిన్నగా చేసే ప్రయత్నంలో  రాష్ట్ర ప్రభుత్వాల ఆలస్యం..!


అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్రంరూ. లక్షా డెభ్బై వేలు ఇళ్లకు ఇళ్లకు ఇస్తోంది. అదే మొత్తన్ని రాష్ట్రం లబ్దిదారులకు ఇస్తామంటోంది. అయితే ఏపీలో ఉన్న ప్రస్తుత ధరలతో పోలిస్తే... ప్రభుత్వం ఇచ్చిన సెంట్ స్థలంలో రూ. లక్షా డెభ్బై వేలకు ఇళ్లు కట్టడం సాధ్యం కాదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తాము లక్షల విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చామని చెబుతోంది. లబ్దిదారులు అనుకున్న సమయంలోగా ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు చేస్తామని చెబుతోంది. ఇటీవలే పెద్ద ఎత్తున శంకుస్థాపనలు నిర్వహించారు. అయితే ఆయా స్థలాల్లో రోడ్లు, నీరు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక  సదుపాయాలు కల్పించడానికి కొన్ని వేల కోట్లు అవసరం. ప్రభుత్వానికి ఇదో పెద్ద టాస్క్‌గా ఉంది. అవి కల్పించకపోతే లబ్దిదారులు ఇళ్లు కట్టుకున్నా ప్రయోజనం ఉండదు. తెలంగాణలో కూడా  పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. కానీ లబ్దిదారులను అతి తక్కువగా ఎంపిక చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ పథకాన్ని అమలు చేస్తే రెట్టింపు లబ్దిదారులు ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం వినిపిస్తున్నా.. తెలంగాణ సర్కార్ సొంత ఖర్చుతోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాలని నిర్ణయించుకుంది.