విశ్వనాథం ఏంజెల్ గురించి బాధపడుతూ ఉంటాడు. ఏంజెల్ ని ధైర్యంగా ఉండమని చెప్పమని వసుధారతో విశ్వం చెప్తాడు. అప్పుడే రిషి వచ్చి ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీస్తాడు.


విశ్వం: నేను లేకపోతే ఏంజెల్ ఒంటరి అయిపోతుంది కదా. ఈరోజు కాకపోతే రేపు, ఎల్లుండి అయినా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కదా


ఏంజెల్: ఏంటి విశ్వం నన్ను వదిలి వెళ్లిపోతావా?


విశ్వం: నిన్ను ఒకటి అడుగుతాను కాదనకూడదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి


ఏంజెల్: ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నావ్


వసు: జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం. పిల్లకి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. పెళ్ళయిన తర్వాత వాళ్ళు కలిసిమెలిసి ఆనందంగా ఉండటం చూసి మురిసిపోతారు. అప్పుడు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటారు


Also Read: మాళవిక హత్య జరిగిన చోట వేదకి దొరికిన కీలక ఆధారం- ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?


విశ్వం: నేను ఒంటరి వాడిని కాకూడదని తను పెళ్లి ఆలోచన చేయడం లేదు. నేను నిన్ను ఇన్నాళ్ళూ ఏమి అడగలేదు. ఇది నా కోరిక నెరవేర్చమ్మా. నన్ను ఒక మంచి సంబంధం చూడమంటావా అనేసరికి ఏంజెల్ మౌనంగా వెళ్ళిపోతుంది. తను ఒప్పుకోకపోతే తన జీవితం ఎలా అవుతుందోనని భయంగా ఉంది. తనకి ఒక తోడు ఇవ్వడం నా బాధ్యత.


వసు చేతిలో రిషి చేతిని పెట్టి పట్టుకుని ఏంజెల్ జీవితం మీ చేతుల్లో పెడుతున్నా. తన బతుకు మీరే చక్కదిద్దాలి అని అడుగుతాడు. అందుకు ఇద్దరూ సరే అంటారు. వసు డల్ గా ఇంటికి వస్తుంది. తనని చూసి చక్రపాణి ఏమైందని అడుగుతాడు. విశ్వనాథం గారికి అలా జరిగిందని ఏంజెల్ చాలా భయపడుతుందని చెప్తుంది. సర్ కూడా తన విషయంలో బెంగ పెట్టుకుని కంగారుపడుతున్నారని, అందుకే తనకి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కానీ తను మాత్రం మౌనంగా పక్కకి వెళ్లిపోతుందని బాధగా చెప్తుంది. కూతురి మాటలు విన్న చక్రపాణి రిషి సర్ ఉన్నారు కదా తనని ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తారని ధైర్యం చెప్తాడు.


రిషి కాలేజ్ లో ప్రిన్సిపాల్ ని కలుస్తారు. మహేంద్ర, జగతి ఫోన్ చేశారని డీబీఎస్టీ కాలేజ్ నుంచి మిషన్ ఎడ్యుకేషన్ సంబంధించి డీటైల్స్ పంపిస్తానని అన్నారు విశ్వనాథం గారికి బాగోలేదని నేనే వద్దని చెప్పానని చెప్తాడు. అప్పుడే ఒకతను వచ్చి పేపర్ ఇస్తాడు. పతనం దిశగా డీబీఎస్టీ కాలేజ్, తగ్గిపోతున్న స్టూడెంట్స్ ప్రవేశాల సంఖ్య అంటూ ఆర్టికల్ వస్తుంది. డీబీఎస్టీ కాలేజ్ గురించి చాలా తక్కువ చేసి రాశారు అది ఎంత వరకు నిజమో తెలియదని అతను అంటాడు. డీబీఎస్టీ కాలేజ్ మూసేయడం ఏంటి? అసలు ఎవరు రాశారు ఇది? ఇదంతా జరుగుతుంటే డాడ్, జగతి మేడమ్ ఏం చేస్తున్నారు. ఈ న్యూస్ వాళ్ళు చూశారా లేదా అని రిషి మనసులో అనుకుంటాడు. దీని గురించి కాలేజ్ లో ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. కాలేజ్ తో తనకున్న జ్ఞాపకాలు తలుచుకుంటాడు.


రిషి: అసలు ఇంత జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు. మినిస్టర్ మెచ్చుకున్నారు. సొసైటీలో మంచి పేరు వచ్చింది. విద్యారంగంలో కూడా ఎంతో మంది డీబీఎస్టీ కాలేజ్ చూసి మురిసిపోయారు. నేను కలలో కూడ ఊహించలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని


Also Read: కృష్ణ,మురారీలని కలిపేందుకు గౌతమ్ ప్లాన్- తన ప్రేమ గెలుస్తుందనే ఆనందంలో ముకుంద


అప్పుడే పాండ్యన్ బ్యాచ్ వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ కోసం కొన్ని ఏరియాస్ లో సర్వే చేశామని చెప్తారు. రిషి పరధ్యానంగా ఉంటే ఏమైందని స్టూడెంట్స్ అడుగుతారు. వాళ్ళ వెనుక వసుధార ఉండటం చూసి ఏదో చెప్పబోయి ఆగిపోతాడు. ఏమైందని వసు పాండ్యన్ వాళ్ళని అడుగుతుంది. ప్రిన్సిపాల్ రూమ్ లో ఈ పేపర్ చూశారు అప్పటి నుంచి ఇలా మూడీగా ఉన్నారని పేపర్ చూపిస్తారు. అందులో న్యూస్ చూసి వసు షాక్ అవుతుంది. అటు మహేంద్ర కూడా ఇదే న్యూస్ ని జగతికి చూపిస్తాడు. అది చూసి కళ్ళు తిరిగి పడబోతుంది.


జగతి: మన కాలేజ్ లో స్టూడెంట్స్ తగ్గిన మాట నిజమే కానీ ఇంత బ్యాడ్ గా రాయడం ఏంటి?


మహేంద్ర: అదే నాకు అర్థం కావడం లేదు


జగతి: అసలు ఇంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ బయటకి ఎలా వచ్చింది. ఇది మన స్టాఫ్ లో ఎవరైనా లేదంటే శైలేంద్ర చేసి ఉండవచ్చు.


మహేంద్ర: ఇలా చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. వెంటనే నేను తెలుసుకుంటాను దీనికి కారణం ఎవరు అనేది


శైలేంద్ర కోపంగా ఆ పేపర్ తీసుకొచ్చి టేబుల్ మీద జగతి ముందు విసిరి ఏంటి పిన్ని ఇది అని సీరియస్ గా అడుగుతాడు.


జగతి: నేను అదే అడుగుతున్నా


శైలేంద్ర: ఏంటి తిరిగి నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇది మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించినది కాదు కాలేజ్ కి సంబంధించింది. నేను కాలేజ్ బోర్డ్ మెంబర్ ని. దీని గురించి ఎవరెవరో ఫోన్ చేసి అడుగుతున్నారు నాకు తల కొట్టేసినట్టుగా ఉంది


మహేంద్ర: ఎవరు ఫోన్ చేశారు. అసలు నువ్వు ఇక్కడ బోర్డ్ మెంబర్ అని ఎవరికీ తెలియదు. ఇక నీకు ఫోన్ చేసి అడుగుతారా? చెప్తే నమ్మేలా ఉండాలి


శైలేంద్ర: వాటితో నాకు సంబంధం లేదు ముందు మీరు దీనికి సమాధానం చెప్పండి బాబాయ్