టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి రావడంతో సినీ ప్రముఖుల్లో వణుకు పట్టుకుంది. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 12 మందికి నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని తేదీలు కూడా కేటాయించింది. తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను విచారించి.. ఆయన బ్యాంక్ అకౌంట్లను పరిశీలించింది. సుమారు 10 గంటల సేపు ఆయన్ను విచారించింది. ఈ సందర్భంగా పూరీ తన మూడు బ్యాంక్ అకౌంట్ల లావాదేవీల వివరాలను ఈడీకి అప్పగించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌ను ఈడీ ముందు లొంగిపోవడంతో ఏ నిజాలు బయటపడతాయా అనే ఆందోళన తారల్లో నెలకొంది. 


టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ శాఖ నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా ఈడీ ఆరు నెలల కిందటే కెల్విన్‌పై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కెల్విన్ ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారాడు. ప్రస్తుతం కెల్విన్ బ్యాంక్ లావాదేవీలను ఈడీ ఫ్రీజ్ చేసింది. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ కేసు విచారణకు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలతో సినీ ప్రముఖలను విచారిస్తోంది. డ్రగ్స్ కోసం ఏయే తారల నుంచి ఎంత మొత్తం కెల్విన్‌ ఖాతాలో పడిందనే వివరాల జాబితా ఈడీ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను 2015 నుంచి ఇప్పటివరకు జరిగిన ట్రాన్సాక్షన్ వివరాల జాబితాను తీసుకురావాలని ఈడీ కోరినట్లు సమాచారం. ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలైంది. అయితే 12 మంది విచారణ పూర్తయిన తర్వాతే.. ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే విషయంపై స్పష్టత వస్తుంది. 


Also Read: తెలుగులో ‘మనీ హీస్ట్’ పార్ట్-5: ప్రొఫెసర్ చనిపోతారా? తెరపైకి టోక్యో ఫ్లాష్‌బ్యాక్!


ప్రస్తుతం ఈ కేసుకు డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో సంబంధం లేదు. కేవలం వాటిని కొనుగోలు చేయడానికి జరిగిన లావాదేవీలు గురించే విచారణ ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఆ మేరకు అదనపు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఈడీ పూరీ జగన్నాథ్ ఆరేళ్ల ట్రాన్సాక్షన్స్ కావాలని కోరింది. ఈ సందర్భంగా పూరీ తన మూడు అకౌంట్లలో 2015 - 2021 మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ఈడీకి అందించినట్లు సమాచారం.  


Also Read: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?


మాదక ద్రవ్యాల తరలింపుపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గతంలో మొత్తం 62 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ కూడా అందర్నీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పాత నేరస్తుల్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. మరో వైపు ఈడీ వర్గాలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. డ్రగ్స్ ఎలా తెప్పించేవారు..?  డబ్బులు ఎలా చెల్లించారు..? అన్న వాటిపై పూర్తి సమాచారం ఈడీ అధికారులు సేకరించారని.. ఆ ఆధారల ప్రకారమే సినీ ప్రముఖులను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: ప్రశాంతంగా సెలవు తీసుకుని ఈ వెబ్ సిరీస్ చూడండి.. ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ బంపరాఫర్..


డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలన్నీ హవాలా మార్గంలో జరిగినట్లుగా భావిస్తున్నారు. అలాగే నేరం చేసినట్లుగా నిరూపితమైతే ఆస్తులు జప్తు చేస్తే అవకాశం ఉంది. పబ్ నిర్వహించే ఓ సినీ ప్రముఖుడు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తెప్పించి సినీ వర్గాలకు సరఫరా చేసినట్లు తెలిసింది. దీంతో అతడి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రగ్స్ కేసు మళ్లీ తెరుచుకోవడంతో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ కేసు పరోక్షంగా తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల విచారణకు కూడా పరోక్షంగా సహాయపడనుంది. ప్రస్తుతం వారికి ఎలాంటి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చార్జిషీట్‌లో పోలీసులు పేర్లు పెట్టలేదు. ఈడీ విచారణ తర్వాత చార్జిషిట్లను సవరిస్తూ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. ఇప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఈడీ తేల్చితే వారిపై ఎక్సైజ్ శాఖ కూడా కొత్తగా చర్యలు తీసుకోక తప్పదు. దీంతో టాలీవుడ్ స్టార్ల పరిస్థితి దయనీయంగా మారుతుంది. రెండు రకాలుగా ఇరుక్కొనే పరిస్థితి నెలకొంటుంది. మున్ముందు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 


Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..