తెలుగు ప్రజలకు సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ సినిమాల్లోని నటీనటులను ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే. వారిని తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. తారలంటే వారి దృష్టిలో తెరపై మెరిసే మాణిక్యాలు. కానీ, వారిలో కొందరు మత్తులో జోగే మాణిక్యాలంటే ఎవ్వరూ నమ్మలేరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే పరిస్థితి ఉంది. తెలుగులోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఎంతోమంది అభిమానం చూరగొన్న పూరీ జగన్నాథ్ ఇలా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారంటే ఎవ్వరూ నమ్మలేరు. బ్యాంకాక్ ఇసుక తిన్నెల్లో చక్కని కథలు రాసుకొనే పూరీ.. నిర్దోషిగా బయటపడి మళ్లీ అలరించాలనే కోరుకుంటారు. ఆయనే కాదు ఈ కేసులో చిక్కున్న తారలంతా బయటపడితే హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. టాలీవుడ్‌పై పడిన మచ్చ తొలగిపోయిందని సంతోషిస్తారు. ఎక్సైజ్ అధికారుల విచారణలో మన తారాలకు క్లీన్ చీట్ లభించిందనే సంతోషం ఎన్ని రోజులో నిలవలేదు. పాపం వెంటాడుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఈడీ ఈ కేసును మరింత లోతుగా విచారించడం మొదలుపెట్టింది. ఈడీకి అప్రూవర్‌గా మారిపోయిన కాల్విన్ మస్కరేన్హాస్ ఇచ్చిన వివరాలతో ఆయా తారల బ్యాంకు లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. 


ఆ పార్టీ.. కొంపముంచిందా?: 2016లో హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో నటుడు నవదీప్ పార్టనర్‌గా ప్రారంభించిన ‘ఎఫ్-క్లబ్’ చూట్టూ ఈ డర్టీ పిక్చర్ కథ నడుస్తోంది. ఆ రోజు నవదీప్ ఆహ్వానం మేరకు ఆ క్లబ్‌లో పార్టీకి హాజరైన తారలే ఎక్సైజ్ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా ఈడీ విచారణకు సైతం హాజరువుతున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ అక్రమ సరఫరా నిందితుడు కాల్విన్ మస్కరేన్హాస్ సినీ ప్రముఖులను కలిశాడని తెలిసింది. అతడి వద్ద కొందరు డ్రగ్స్ కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) 12 మంది సినీ ప్రముఖులను విచారించింది. ఆ క్లబ్ ద్వారా భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానం. ఈ నేపథ్యంలో అధికారులు క్లబ్‌ను సీల్ చేశారు. విచారణలో భాగంగా ఎఫ్ క్లబ్‌లోని సీసీటీవీ కెమేరా వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు. 


వీరిలో పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ తదితరులు ఉన్నారు. విచారణలో భాగంగా అధికారులు వారి గోళ్లు, రక్తం, వెంట్రుకలు తదితర శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ కేసు విచారణ సుమారు రెండేళ్లు సాగింది. అయితే, ఈ విచారణకు హజరైన సినీ ప్రముఖుల పేర్లు చార్జిషీట్‌లో నమోదు చేయలేదు. పైగా ఈ డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న 62 మంది బాధితులని పేర్కొనడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద మరోసారి డ్రగ్స్ కేసును విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఈడీ 12 మందికి నోటీసులు పంపింది. అయితే అప్పట్లో సిట్ విచారణలో లేని రకుల్ ప్రీత్, రాణాలను ఈసారి ఈడీ విచారిస్తోంది. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారణకు హాజరైంది. ఆమెతోపాటు బాలీవుడు నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్లను కూడా ఎన్‌సీబీ విచారించింది.  
  
కెల్విన్ ఏం చెప్పాడు?: కెల్విన్ అప్రూవర్‌గా మారడంతో ఈడీ పని సులభమైంది. గతంలో ఎక్సైజ్ శాఖ కూడా కెల్విన్‌ను విచారించింది. కానీ, అప్పట్లో ఏ వివరాలు కెల్విన్ చెప్పలేదు. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు ఆధారంగా ఈడీ ఆరు నెలల కిందట కెల్విన్ మీద కేసు నమోదు చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈడీ అతడిని 12 సార్లు ప్రశ్నించారు. అతడి అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో అప్రూవర్‌గా మారాడు. ఈ సందర్భంగా ఈడీకి పలు కీలక వివరాలను అందించాడు. వాటి ఆధారంగానే ఈడీ తాజాగా 12 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలులో భాగంగా విదేశాలకు భారీగా నగదు బదిలీ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల అకౌంట్లను ఈడీ పరిశీలిస్తోంది. 


Also Read: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. నాడు బాలీవుడ్.. నేడు టాలీవుడ్ కేసులో!


ఈడీ ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌లను విచారించింది. శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్‌ను ముందుగానే విచారిస్తోంది. సెప్టెంబరు 8న రానా దగ్గుబాటిని, 9న రవితేజ, శ్రీనివాస్‌లను, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‌ను, 15వ తేదీన ముమైత్ ఖాన్‌ను, 17న తనీష్, 20న నందు, 22న తేదీన తరుణ్‌‌ను విచారించనుంది. మరి, ఈసారి మన తారలకు క్లీన్ చీట్ లభిస్తోందో లేదో చూడాలి. 


Also Read: ‘బిగ్‌బాస్’ విన్నర్ మృతిపై సందేహాలు.. ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఏమన్నారంటే..


Also Read: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు


Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన