ఇటీవల విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.  కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని దర్శకనిర్మాతలు తెలియజేయడంతో ఈ చిత్రానికి ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. 


ఈ సినిమా చూసి చాలా మంది చలించిపోయారు. కొన్ని రాష్ట్రాలైతే ఏకంగా ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా బాటలోనే మరో కథను కూడా తెరపై చూపించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అదే 'ది కేరళ స్టోరీ'. గత పన్నెండేళ్లలో కేరళ రాష్ట్రంలో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్‌కు గురయ్యారని, దాదాపు 32వేల మంది యువతులను అపహరించారని పేర్కొంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  


‘‘ఓ మతానికి చెందిన వ్యక్తులు ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను వలలో వేసుకొని, ఆ తరువాత వారి మతం మార్చేసి కేరళ నుంచి ముస్లిం వార్ జోన్స్.. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలకు పంపిస్తున్నారు’’ అని పేర్కొంటూ ఈ చిత్రం అనౌన్స్‌‌మెంట్ టీజర్ విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా సినిమా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.