కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. చాలా కాలంగా ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఫైనల్ గా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కానీ రీసెంట్ గా రష్మికకు బదులుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. 


ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. విజయ్ సరసన రష్మికనే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈరోజు రష్మిక పుట్టినరోజు కావడంతో ఆమె కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది దిల్ రాజు టీమ్. మొత్తానికి ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ మధ్యకాలంలో రష్మిక వరుస అవకాశాలతో బిజీ అయింది. ఓపక్క తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో కూడా నటించేస్తుంది. 


ఇక వంశీ పైడిపల్లి-విజయ్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. దళపతి 66వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. విజయ్ నటిస్తోన్న 'బీస్ట్' సినిమా విడుదలైన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. 


Also Read: మొన్న శ్రీవల్లి ఇప్పుడు అఫ్రీన్ - రష్మిక వేరియేషన్స్ మాములుగా లేవు