ధనుష్ (Dhanush) కథానాయకుడిగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మూడు భాషల్లో సినిమా షూటింగ్ జరగనుంది. మూడింటితో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారట.


Dhanush Sekhar Kammula Movie : నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో... అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి. సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 
 
తెలుగు ప్రేక్షకులకు ధనుష్ సుపరిచితులే. తమిళంలో, హిందీలో ఆయన నటించిన సినిమాలు తెలుగులో అనువాదం అయ్యాయి. ఇప్పుడు ఆయన స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. 'సార్' ధనుష్ తొలి తెలుగు సినిమా. నిజం చెప్పాలంటే... ఆ సినిమా కంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. అయితే... సినిమా సెట్స్ మీదకు ఆలస్యంగా వెళుతోందంతే!


''కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ హీరోతో... తన తొలి సినిమాతో జాతీయ పురస్కారాన్ని అందుకుని, కళాత్మక విలువలతో కూడిన కమర్షియల్ చిత్రాలు తీస్తూ విజయాలను అందుకుంటూ పాత్ బ్రేకింగ్ సినిమాలు తెరకెక్కించడంలో మాస్టర్ అయిన మన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయనున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తాం'' అని ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ : సోనాలి నారంగ్. 


శేఖర్ కమ్ముల సినిమా పక్కన పెట్టి... ధనుష్ హీరోగా నటించిన తొలి తెలుగు సినిమా 'సార్' విషయానికి వస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ , త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాణంలో 'సార్' (SIR Movie) రూపొందుతోంది. తమిళంలో 'వాతి' (Vaathi Movie) గా విడుదల చేస్తున్నారు.


Also Read : తెలుగులో విజయ్ పాడలేదు - మరి 'రంజితమే' సింగర్ ఎవరంటే?


డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి...
తొలుత ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ఆ తర్వాత ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు. విద్యా వ్యవస్థ తీరు తెన్నులు మీద సాగే కథతో సినిమా రూపొందుతోంది. ఆ మధ్య 'సార్' సినిమాలో తొలి పాట 'మాస్టారు మాస్టారు... నా మనసును గెలిచారు! అచ్చం నే కలగన్నట్టే... నా పక్కన నిలిచారు' విడుదల చేశారు. జీవీ ప్రకాష్ బాణీ అందించగా... శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు వస్తున్న స్పందన తమకు సంతోషాన్ని ఇస్తోందని చిత్ర బృందం పేర్కొంది.