మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'- ఇంకా షూటింగ్ మొదలుపెట్టకుండానే అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను గ్రాండ్ గా నిర్వహించగా, టైటిల్‌తో పాటు ప్రీ-లుక్ పోస్టర్లు చాలా క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమైయింది.


'మహానటి', 'జెర్సీ', 'ఎవరు', 'శ్యామ్ సింగరాయ్' లాంటి సూపర్‌హిట్ చిత్రాలకు పనిచేసిన అవినాష్ కొల్లా ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో 7 కోట్ల రూపాయిల ఖర్చుతో 70వ దశకంలో నాటి స్టువర్ట్‌పురంను చిత్రీకరీంచడానికి ఓ భారీ సెట్‌ ని నిర్మిస్తున్నారు. శంషాబాద్ సమీపంలో 5 ఎకరాల్లో ఈ సెట్‌ను నిర్మిస్తున్నారు.


అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని భారీగా  నిర్మిస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులపై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70 వ దశకం నాటి స్టువర్ట్‌పురం నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుంది.


టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆర్‌ మదీ సినిమాటోగ్రాఫర్‌ గా పని చేస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. 


Also Read: సెట్స్ లో చూసుకుందాం - రామ్ చరణ్ కి చిరు వార్నింగ్