స్మార్ట్ సిటీ వైజాగ్ అనేక చారిత్రిక ఘట్టాలకూ వేదికైంది. వాటిలో ఒకటి తొలి తెలుగు బైబిల్ ముద్రణ.. క్రీ.శ. 1818లో మొట్టమొదటి సారిగా  తెలుగు బైబిల్ అచ్చయ్యింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అనేక క్రైస్తవ సంఘాలు, శాఖలు ఉన్నాయి. వారంతా ఎక్కువ మంది గ్రీక్ బైబిల్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. దీని నుంచే తెలుగు బైబిల్ కూడా అనువాదమైంది.

 

ప్రస్తుతం విశాఖపట్నంలోని పూర్ణా మార్కెట్ రోడ్డులో ఉన్న లండన్ మిషన్ మెమోరియల్ చర్చ్ లోనే తెలుగు బైబిల్ అనువాద ప్రక్రియ మొదలైంది. ఈ చర్చ్‌ను 1805లో లండన్ నుంచి వచ్చిన మిషనరీలు స్థాపించారు. అప్పటి నుంచి తెలుగు భాషలోనికి బైబిల్‌ను అనువాదం చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

 

తెలుగులో బైబిల్ అనువాదం చేయాలంటే ముందు గ్రీక్‌ భాషలో ఉన్న గ్రంథాన్ని ఇంగ్లీష్‌లోకి అనంతరం తెలుగులోకి ట్రాన్స్‌లేట్‌ చేయాలి. దీని కోసం ఈ మూడు భాషలపై పట్టున్న అనువాదకుడు అన్వేషించారు మతపెద్దలు. 1750లోనే తెలుగులోకి బైబిల్‌ను అనువాదించాలనే ఆలోచన మొదలైంది. కానీ ట్రాన్స్‌లేటర్‌ లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు అప్పటి పెద్దలు. రెవరెండ్ బెంజమిన్ స్కూజ్ అనే లూథరన్ మిషనరీ బైబిల్‌ను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చెయ్యడానికి ప్రయత్నించినా అనువాదం సరిగ్గా లేదని జర్మనీలోని హేలీ ముద్రణాలయం దాన్ని తిరస్కరించింది.

 

లండన్ మెమోరియల్ చర్చ్ మాత్రం దీన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. తీవ్రంగా అన్వేషించి ఆనంద రాయర్ అనే వ్యక్తిని పట్టుకుంది. మైసూరు రాజ్యంలో టిప్పు సుల్తాన్ దర్బార్‌లో పని చేసిన  ఆనంద రాయర్ అసలు పేరు సుందర్ రాయర్. టిప్పు సుల్తాన్ మరణం తరువాత ఆయన విశాఖ పట్నం వచ్చి స్థిరపడ్డారు. అనేక భాషల్లో పట్టున్న ఆయన క్రిస్టియానిటీ స్వీకరించి పేరును ఆనంద రాయర్‌గా మార్చుకున్నారు. అదే సమయంలో వైజాగ్‌లోని లండన్ మెమోరియల్ చర్చ్‌లో బైబిల్ తెలుగు అనువాద ప్రయత్నాలు మొదలయ్యాయి. రెవరెండ్ ఆగస్టస్ డీ గ్రెన్ జెస్, రెవరెండ్ జార్జ్ క్రేన్ ఆనంద రాయర్ సహకారంతో తెలుగు బైబిల్ రూపొందించడం మొదలు పెట్టారు. 

 

బెంగాల్‌లోని శెరంపూర్‌గా పిలిచే శ్రీరామపురంలో రెవరెండ్ విలియం కేరీ ఆధ్వర్యంలో కూడా తెలుగు బైబిల్ అనువాదం మొదలయ్యింది. ఒకే సమయంలో రెండు చోట్ల తెలుగు బైబిల్ అనువాద ప్రక్రియ ప్రారంభించారన్నమాట. విశాఖపట్నంలో ట్రాన్స్ లేషన్ జరుగుతుండగానే. ఆగస్టస్ డీ గ్రెన్ జెస్, జార్జ్ క్రేన్ మృతి చెందారు. అయినప్పటికీ ఆనంద రాయర్ సహకారంతో విలియం గార్డెన్, ఎడ్వర్డ్  పిచెస్ అనే మిషనరీలు బైబిల్ ట్రాన్సిలేషన్ పూర్తి చేశారు. 

 

ఒకేసారి ప్రింట్ అయిన రెండు అనువాదాలు 

 

బెంగాల్‌లోని శెరంపూర్‌లోనూ, విశాఖపట్నంలో సిద్ధమైన రెండు బైబిళ్లు రెండూ ఒకేసారి 1818లో ప్రింట్ అయ్యాయి. అయితే రెండు వెర్షన్‌లనూ పరిశీలించిన మద్రాస్ ప్రెసిడెన్సీలోని కాలేజ్ ఆఫ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ స్కాలర్ క్యాంప్ బెల్ విశాఖ పట్నంలో తయారైన బైబిల్ సాధికారికంగా.. వ్యావహారిక భాషలో ఉందని సర్టిఫై చేసింది. దీంతో విశాఖలో రూపుదిద్దుకున్న తెలుగు బైబిల్‌నే ప్రామాణికంగా తీసుకోవడం మొదలుపెట్టాయి మిషనరీలు. ప్రస్తుతం తెలుగు  రాష్ట్రాల్లో అనేక వెర్షన్‌లుగా చలామణీలో ఉన్న బైబిళ్లు దీని నుంచి వచ్చినవే అంటారు చరిత్రకారులు 

 

బెంగుళూరులో దాచిన బైబిల్ 

 

వైజాగ్ బైబిల్ ఆమోదం పొందడంతో బెంగాల్లో తయారైన తెలుగు బైబిల్ 1821 నాటికి తెరమరుగై పోయింది. నిజానికి మొదటి తెలుగు బైబిల్‌లో కేవలం కొత్త నిబంధనగా చెప్పుకునే న్యూ టెస్ట్ మెంట్ మాత్రమే అందులోనూ మత్తయి, లూకా, మార్కు సువార్తలు మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఆ భాష కూడా ప్రస్తుత తెలుగుకు చాలా భిన్నంగా ఉంటుంది. ఆ తరువాత 1850లో ప్రెస్ ఫర్ మద్రాస్ ఆక్సిలరీ సొసైటీ పూర్తి తెలుగు బైబిల్ విశాఖపట్నంలో ముద్రించారు. ఇక 1818 నాటి తొలితెలుగు బైబిల్ రెండు వాల్యూమ్‌లుగా ప్రింట్ అయింది. ఆ బైబిల్‌లోని రెండు కాపీలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నాయి. లండన్ మ్యూజియంలోని ఆర్కేవ్స్‌లో తెలుగు బైబిల్ రెండు వాల్యూమ్‌లో భద్రపరచిచారు. మరోక బైబిల్ విశాఖలోని లండన్ మెమోరియల్ చర్చ్‌లోనే ఉండేది. అయితే అది వాల్యూమ్ 1 మాత్రమే. దీనిలోని రెండో భాగం ఇండియాలో లేదు.

 

ఇక్కడ ఉన్న ఒక్క పుస్తకాన్ని కూడా భద్రపరచడం కష్టం అని భావించిన చర్చ్ యాజమాన్యం ఒక ఫోటో కాపీని చర్చ్‌లో ఉంచి అసలు పుస్తకాన్ని బెంగుళూరులోని ఆర్కైవ్స్‌లో భద్రపరిచారు. అది ప్రస్తుతం అక్కడే ఉంది. 2018లో ఈ తెలుగు బైబిల్ పుట్టి 200 ఏళ్ళు అయిన సందర్బంగా విశాఖపట్నంలో ఉత్సవాలు కూడా జరిపామని లండన్ మిషన్ మెమోరియల్ చర్చ్ సెక్రటరీ సదానంద్ మోజెస్ తెలిపారు. 

 

తెలుగు కాదు... ..  Teloogoo .. !

 

ఈ తొలి తెలుగు బైబిల్ మొదటి పేజీ ని చూస్తే 200 ఏళ్ల క్రితం తెలుగు భాష ఏ విధంగా ఉండేదో తెలుస్తుంది. తెలుగును ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు TELOOGOO అని ఉంది. మతాల సంగతి ఎలా ఉన్నా ఆనాటి వ్యవహారిక  భాష ఎలా ఉండేదో ఈ తొలి తెలుగు బైబిల్ చెబుతుంది . ప్రస్తుతం తెలుగు బైబిల్ పుట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైజాగ్ RK బీచ్ తీరంలో ఒక మెమోరియల్ ఏర్పాటు చెయ్యడానికి లండన్ మెమోరియల్ చర్చ్ ప్రయత్నిస్తుంది.