పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్(Krish) 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. 


మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) రిలీజ్ డేట్ విషయాన్ని బయటపెట్టారు. 


ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజ్ రాబోతుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' టీమ్ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ను, వీడియోలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది.  


ఇదొక పీరియాడికల్ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది నిర్మాతలు ఆలోచన. ఈ సినిమాతో పాటు తమిళ సినిమా 'వినోదయ సీతమ్'(Vinodhaya Sitham) రీమేక్ లో నటించడానికి పవన్ అంగీకరించారు. సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా నటించనున్నారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.


ఆ విధంగా 2022లో రెండు సినిమాలను పూర్తి చేయాలనేది పవన్ ఆలోచన. 2023 మార్చికి 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) సినిమా రిలీజ్ కానుంది. వేసవిలో 'వినోదయ సీతమ్' రిలీజ్ అవుతుంది. వచ్చే ఏడాదిలోనే హరీష్ శంకర్ సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'(Bhavadeeyudu Bhagat Singh) సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతానికి పవన్ ఈ మూడు సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. 2024 ఎలెక్షన్స్ సమయంలో పవన్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కొత్త సినిమాలు కమిట్ అవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట!


ఇక 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్


Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్