ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మరో బాలీవుడ్ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా,  కియారా అద్వానీ త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి.  పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరగనుంది.  


ఒకే రోజు హల్దీ, సంగీత్ వేడుకలు


ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో సిద్దార్ధ్, కియారా హల్దీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి.  మరుసటి రోజు, కియారా, సిద్ధార్థ్ వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే హల్దీ వేడుకల కోసం ప్రత్యేక వస్త్రాలు కొనుగోలు చేశారు. ఈ వేడుకలలో నృత్యాల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు విదేశాల నుంచి ఓ టీమ్ ను రప్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వేడుకల్లో ప్రదర్శనల కోసం కోసం కొత్త పెళ్లి జంట ప్రాక్టీస్ చేస్తోందట. వీరితో పాటు మిత్రులు కూడా ఇందులో భాగం కానున్నారని తెలిసింది.


జైసల్మేర్ లో పెళ్లి భారీగా ఏర్పాట్లు


కియారా, సిద్ధార్థ్ పెళ్లి  జైసల్మేర్‌ లోని సూర్యగఢ్ ఫైవ్ స్టార్ హోటల్‌ లో జరగనుంది. ఇప్పటికే హోటల్ లో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ హోటల్లో పెళ్లికి నూతన జంట రెడీ అవుతోంది. బంధు మిత్రుల కోసం విలాసవంతమైన విల్లాలను బుక్ చేశారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటల్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.   


ఫిబ్రవరి 6వివాహ వేడుక  


ఫిబ్రవరి 6న సిద్ధార్థ్, కియారా వివాహ వేడుక  జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులు, కొద్ది మంది మిత్రులు మాత్రమే హాజరుకానున్నారు. ఈ వివాహానికి ఆహ్వానించబడిన బాలీవుడ్ ప్రముఖులలో మనీష్ మల్హోత్రా, అశ్విని యార్డి, వరుణ్ ధావన్,  కరణ్ జోహార్ ఉన్నారు.


ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్


పెళ్లి వేడుక జైసల్మేర్ లో జరగనుండగా,  ముంబైలో తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం సిద్ధార్థ్, కియారా గ్రాండ్ రిసెప్షన్ పార్టీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.


పెళ్లి వేడుక కోసం భారీగా ఏర్పాట్లు


సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులు ఈ వెడ్డింగ్ కోసం భారీగా ఏర్పాటు చేస్తున్నారు.  ఇరు కుటుంబాలు షాదీలోని ప్రతి అంశాన్ని స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు పెద్ద వెడ్డింగ్ ప్లానర్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నారట. అటు మొత్తం వివాహ వేడుకను డాక్యుమెంట్  చేయనున్నారట.  


కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన 'భరత్ అను నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకొని అక్కడే సెటిల్ అయింది. కియారా-సిద్దార్థ్ మల్హోత్రా కలసి ‘షేర్షా’ సినిమాలో తొలిసారి స్క్రీన్‌ పంచుకున్నారు.






Read Also: కియారా-సిద్ధార్థ్ ప్రేమ కథ ఎక్కడ? ఎలా మొదలైంది - పెళ్లి వేదిక ఖరారు?