బాలీవుడ్ క్యూట్ లవర్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. త్వరలో తమ ప్రేమ బంధాన్ని, మూడు ముళ్ల బంధంతో సంసార బంధంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి గురించి రకరకాల వార్తలు రాగా, ఎట్టకేలకు ఫిబ్రవరిలో వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కియారా, సిద్ధార్థ్  సన్నిహితులు ఈ విషయాన్ని ఇప్పటికే ధృవీకరించారు.


వీరి ప్రేమ ఎలా మొదలయ్యిందంటే?


సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ‘షేర్షా’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరు తొలిసారి కలిశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి పలు పార్టీల్లో, ఈవెంట్స్ లో ఎంజాయ్ చేశారు. మిత్రుల పార్టీల్లో ఇద్దరు సన్నిహితంగా కనిపించేవారు. ఇద్దరు కలిసి వెకేషన్స్ కు వెళ్లినా ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేవారు కాదు. కొద్ది రోజుల క్రితం సిద్ధార్థ్‌, కియారా అద్వానీ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా క‌ర‌ణ్‌ జోహార్‌ సహా పలువురు బాలీవుడ్ నటులు హింట్ ఇచ్చారు. వారిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని ఇప్పటికే తెలిపారు. ఇటీవల కియారా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను చెప్పింది. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వివరించింది. అయితే, తను చెప్పింది సిద్ధార్థ్ గురించేనని ప్రచారం జరిగింది.  






జైస‌ల్మేర్ ఫోర్ట్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక  


కియారా- సిద్ధార్థ్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లి వేడుక వేదిక ఖరారు అయ్యింది. రాజ‌స్థాన్‌ లోని జైస‌ల్మేర్ ఫోర్టులో వీరి వెడ్డింగ్ జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.


పెళ్లి గురించి త్వరలో అధికారిక ప్రకటన


ఇప్పటి వరకు సిద్ధార్థ్‌, కియారా తమ పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో త్వరలోనే అఫీషియల్ గా ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇక కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తోంది. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  


Read Also: ప్రేమలో తమన్నా, విజయ్ - వీరి లవ్ స్టోరీ ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసా?