చిరంజీవి, రవితేజ, శృతిహాసన్ కీలక పాత్రలు పోషించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా  సంక్రాంతి కానుకగా విడుదలై  థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, గత ఆదివారం రాత్రి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మెగస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజ్ రవితేజ, నటి ఊర్వశీ రౌతేలా, దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. హీరోయిన్ శృతిహాసన్ మాత్రం హాజరు కాలేదు. బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ సినిమాకు హాజరైన శృతి హాసన్ చిరంజీవి ఈవెంట్‌కు రాకపోవడం ఏమిటంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. 


ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే రాలేకపోయానన్న శృతి హాసన్


ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే ఊహించిన శృతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌కు ఎందుకు రాలేకపోతుందో వెల్లడించింది.  ‘‘జ్వరంగా ఉండటం వల్ల ఈ రోజు ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌కు రాలేకపోతున్నందుకు గుండె పగిలినంత బాధగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవిగారితో కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌ విజవంతం కావాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది.


మీ ఊహాగానాలకు ధన్యవాదాలంటూ శృతి లేటెస్ట్ ట్వీట్


అనారోగ్యంతో ‘వాల్తేరు వీరయ్య‘ ఈవెంట్ కు రాలేకపోయానని శృతి హాసన్ చెప్పడంతో ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని, వాటిని తొలగించుకునేందుకు విదేశాల్లో చికిత్స పొందుతుందని, రకరకాల వార్తలు రాసేశాయి వెబ్ సైట్లు. వాటిపై తాజాగా శృతి హాసన్ స్పందించింది. “మీ ఊహాగానాలకు  ధన్యవాదాలు, ప్రస్తుతం నేను వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్నాను” అంటూ ట్వీట్ చేసింది.  






‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా.. కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌ మెంట్‌ లో పని చేశారు. ఇవాళే (జనవరి 13న) ఈ సినిమా విడుదల అయ్యింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.    






Read Also: ‘RRR’ టీమ్‌కు అలియా గ్రాండ్ ఫార్టీ, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?