సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. 

 

రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'కళావతి' అనే పాటను విడుదల చేయగా.. తాజాగా సినిమాలో సెకండ్ సింగిల్ 'పెన్నీ సాంగ్' ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార కనిపించింది. సాంగ్ లో తండ్రీకూతుళ్ల స్టెప్స్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ ప్రోమో యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతోంది. 

 

పూర్తి పాటను మార్చి 20న విడుదల చేయనున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఆర్. మధి, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్.