మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సమాచారం టాలీవుడ్ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్న సాయి ధరమ్ తేజ్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ఈ సమాచారం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకుని తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రమాద వార్త విని మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున తేజ్ చికిత్స పొందుతున్న మెడికవర్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. 


ప్రస్తుతం తేజ్ ఆరోగ్యంగా నిలకడగా ఉందని, వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం తేజ్‌ను అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో తేజ్ బైకును వేగంగా నడిపాడా లేదా రోడ్డు మీద స్కిడ్ అయ్యిందా అనేది పూర్తిగా తెలియరాలేదు. అయితే, ప్రమాద తీవ్రతకు తేజ్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకోవడంతో బ్రెయిన్ స్కాన్ చేశారు. అయితే, ఎలాంటి అంతర్గత గాయాలు లేకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. హాస్పిటల్‌లో చికిత్స తర్వాత తేజ్‌ కోలుకుంటున్నట్లు సమాచారం. ఎలాంటి ప్రాణాపాయం లేనట్లు వైద్యులు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.  ప్రమాద సమయంలో తేజ్ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. 


ప్రస్తుతం ధరమ్ తేజ్ అపోలో హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులంతా హాస్పిటల్‌లోనే ఉన్నారు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నెంబరు-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదం సమయంలో తేజ్ మద్యం తాగలేదని తెలిసింది. రోడ్డు మీద ఇసుక బురద ఉండటం వల్ల బైక్ జారిపోయిందని, దీంతో తేజ్ రోడ్డు మీద పడి స్పృహ కోల్పోయాడని తెలిసింది. ఛాతి, కుడి కన్నుపై, పొట్ట భాగంలో తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తేజ్‌కు క్లావికల్ ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. 


Also Read: సాయి ధరమ్ తేజ్‌ హెల్త్‌పై స్పందించిన పవన్.. బైక్‌ ప్రమాదం అందుకే జరిగింది: పోలీసులు


తేజ్ ప్రమాద వార్త తెలియగానే మెగా ఫ్యామిలీ అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సాయి థరమ్ తేజ్ తన అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ట్వీట్ చేసిన దాదాపు 9 గంటల్లోనే రోడ్డు ప్రమాదానికి గురవ్వడం.. అభిమానులకు కలవరపరుస్తోంది. సాయి ధరమ్ తేజా చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని.. తాను ప్రమాదానికి గురై ఇలా అపస్మారక స్థితికి చేరుకోవడం బాధకరమని అంటున్నారు. 


Also Read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు


2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. సుప్రీం, విన్నర్ సినిమాల ద్వారా తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వల్ల వెనుకబడినట్లు కనిపించినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ‘రిపబ్లిక్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా గురువారం (సెప్టెంబరు 9న).. ‘రిపబ్లిక్’ మూవీ టీమ్ ద్వారా కలెక్టర్లను గౌరవిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోనే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటాడు. ఇండస్ట్రీలో కూడా తేజ్‌కు సౌమ్యుడిగా మంచి పేరు ఉంది.