ప్రముఖ టాలీవుడ్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన తేజ్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నెంబరు-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిసింది. ప్రస్తుతం తేజ్‌ మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఛాతి, కుడి కన్నుపై, పొట్ట భాగంలో తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. 


సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సమాచారం తెలియగానే మెగా కుటుంబం ఆందోళనకు గురైంది. ముఖ్యంగా తేజ్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడనే విషయం తెలియగానే మరింత టెన్షన్ నెలకొంది. వెంటనే మెగా కుటుంబికులు తేజ్ పరిస్థితిని తెలుసుకొనేందుకు హాస్పిటల్‌కు వెళ్లారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇప్పటికే హాస్పిటల్‌కు వెళ్లి.. తేజ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స తర్వాత తేజ్ కోలుకున్నట్లు తెలిసింది. తేజ్ ప్రమాద వార్త తెలియగానే మెగా ఫ్యామిలీ అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. 


వినాయక చవితి సందర్భంగా సాయి థరమ్ తేజ్ తన అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ట్వీట్ చేసిన దాదాపు 9 గంటల్లోనే రోడ్డు ప్రమాదానికి గురవ్వడం.. అభిమానులకు కలవరపరుస్తోంది. సాయి ధరమ్ తేజా చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని.. తాను ప్రమాదానికి గురై ఇలా అపస్మారక స్థితికి చేరుకోవడం బాధకరమని అంటున్నారు. 


2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. సుప్రీం, విన్నర్ సినిమాల ద్వారా తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వల్ల వెనుకబడినట్లు కనిపించినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ‘రిపబ్లిక్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా గురువారం (సెప్టెంబరు 9న).. ‘రిపబ్లిక్’ మూవీ టీమ్ ద్వారా కలెక్టర్లను గౌరవిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోనే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటాడు. ఇండస్ట్రీలో కూడా తేజ్‌కు సౌమ్యుడిగా మంచి పేరు ఉంది.