‘RRR’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం సుమారు రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. విడుదలైన అన్ని దేశాల్లో అద్భుత స్పందన అందుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగారూపొందిన  ఈ మాగ్నమ్ ఓపస్.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. 100 ఏళ్ళ భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది.


గోల్డెన్ ట్రైలర్ అవార్డుకు ‘RRR’ రీ-రిలీజ్ ట్రైలర్ నామినేట్  


‘RRR’ చిత్రం రీ-రిలీజ్ ట్రైలర్ గోల్డెన్ ట్రైలర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఉత్తమ విదేశీ ట్రైలర్ కేటగిరీలో ఈ నామినేషన్ అందుకుంది. కచ్చితంగా ఈ అవార్డు ఈ సినిమాకే వస్తుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ‘RRR’  చిత్రానికి ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ సహా పలు అవార్డులు వచ్చాయి. 


ఆద్యంతం అలరించిన ‘RRR’ ట్రైలర్


ఇక ‘RRR’ సినిమా విడుదలైన తర్వాత ఏడాదికి మళ్లీ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షులను మంత్రముగ్దులను చేసింది. మూడు గంటల సినిమాను 2 నిమిషాల్లో చూపించేశారు. ఆద్యంతం ఉత్కంఠభరిత సన్నివేశాలతో నిండిన ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఊపిరి పీల్చుకోవడం మరిచిపోతాం. ఒక వైపు భీమ్.. మరో వైపు రామ్.. తమ పర్‌ఫార్మెన్స్‌తో కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారు. విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయ్. కాసేపు మనల్ని ఆ రోజుల్లోని స్వాతంత్ర్య పోరాటంలోకి తీసుకెళ్లిపోతాయి. ఎన్టీఆర్ పులితో భీభత్సంగా పోరాటం చేయడంతో మొదలయ్యే ఈ ట్రైలర్,  తెల్లదొరల ఆధిపత్యానికి ఇద్దరు వీరులు ఎలా ఎదురు తిరిగారు అనే వరకూ ఇందులో చూపించారు. ఆ తర్వాత వంతెనపై వచ్చే సన్నివేశంలో.. భీమ్, రామ్ బ్రిడ్జికి వేలాడుతూ చేతులు పట్టుకొనే సన్నివేశాన్ని చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి. రామ్ చరణ్‌ను అల్లూరిగా చూపించే సన్నివేశాలు కన్నులు పండువగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. అలాగే, బుల్లెట్‌ను ఎన్టీఆర్ కాలితో సన్నివేశం కూడా అద్భుతం. ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ స్నేహాన్ని చూపించారు.  ఇద్దరూ కలిసి బ్రిటీషర్లపై చేసిన పోరాటాన్ని చూపిస్తారు.  






అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లాంటి ఇద్దరు విప్లవ వీరుల స్పూర్తితో అల్లుకున్న కల్పిత కథతో RRR చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. భీమ్ గా తారక్, రామరాజుగా చరణ్ నటించారు. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియా సరన్, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.  


Read Also: మహేష్ బాబు వెళ్ళింది ఎవరి ఫంక్షన్‌కో తెలుసా? మధ్యలో అఖిల్ ఎందుకొచ్చాడు?