దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది. దీనికోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలను తెరపై ఎంత పవర్ ఫుల్ గా చూపించబోతున్నారో మూడు నిమిషాల ట్రైలర్ తో చెప్పే ప్రయత్నం చేశారు రాజమౌళి. ఈ ట్రైలర్ చూసిన అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా రాజమౌళిని పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. 

 

రిలీజ్ కి మరో నెల రోజులు ఉన్నప్పటికీ.. 'ఆర్ఆర్ఆర్' టీమ్ చాలా అగ్రెసివ్ గా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ముంబై, బెంగుళూరులలో ప్రెస్ మీట్స్ ను నిర్వహించింది. మీడియాతో ఇంటరాక్షన్ సెషన్స్ లో పాల్గొంది. ఇప్పుడు గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం వరంగల్ వేదిక కాబోతుంది. వరంగల్ లో ఈవెంట్ ని ప్లాన్ చేయడానికి ఓ కారణమున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వరంగల్ లో కలుసుకున్నారని కొన్ని స్టోరీస్ లో రాసి ఉంది. ఇందులో నిజమెంత అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ సినిమాపై హైప్ పెంచడానికి 'ఆర్ఆర్ఆర్' టీమ్ వరంగల్ లొకేషన్ ను ఎన్నుకుంది.

 

భారీ బందోబస్త్ మధ్య ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్ కి ఇండస్ట్రీ నుంచి కొందరు పెద్దలు అతిథులుగా రానున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ కి జోడీగా ఒలీవియా మోరిస్ నటించింది. అజయ్ దేవగన్, శ్రియాశరన్, సముద్రఖని లాంటి తారలు సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.