'పెళ్లి చూపులు', 'వరుడు కావలెను'... రెండూ పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలే. కథ, కథనాలు వేరు అనుకోండి. అయితే... రెండింటిలోనూ కథానాయిక రీతూ వర్మనే. ఈ శుక్రవారం 'వరుడు కావలెను' విడుదల కానున్న నేపథ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చారు. అప్పుడు పెళ్లి ప్రశ్న ఎదురైంది. అందుకు రీతూ వర్మ సమాధానం ఇస్తూ... "నా పెళ్లికి ఇంకా ఇంకా చాలా సమయం ఉంది. మరో రెండు మూడేళ్లు పట్టవచ్చు. మా ఇంట్లో ఆ విషయం గురించి నన్ను ఇబ్బంది పెట్టరు. ఏదో అప్పుడప్పుడు సరదాగా పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు. పెళ్లి విషయం నాకే వదిలేశారు" అని చెప్పారు.

 



'వరుడు కావలెను' సినిమా గురించి రీతూ వర్మ మాట్లాడుతూ "కథానాయికలకు చాలా అరుదుగా సవాల్ విసిరే పాత్రలు వస్తుంటాయి. అటువంటి పాత్రే ఈ సినిమాలో నేను చేసిన భూమి పాత్ర. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. నాతో పాటు నాగశౌర్య పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మా ఇద్దరి జోడీ బాగా కుదిరింది. ప్రేమకథలకు హీరో హీరోయిన్ల జోడీ కుదిరితే సగం విజయం సాధించినట్టే. ఆ విధంగా మేం సగం విజయం సాధించాం. ఇది ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు. సినిమాకు దర్శకత్వం వహించినది మహిళ కాబట్టి కథానాయిక పాత్రను బాగా రాశారు. సినిమాలో పాటలు చాలా బావుంటాయి. నేను కష్టపడి ఓ మాస్ సాంగ్ కి డాన్స్ చేశా. ప్రేక్షకులకు అది నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.


Also Read: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!



'పెళ్లి చూపులు' సక్సెస్ అయినప్పటికీ... ఆ తర్వాత తెలుగులో రీతూ వర్మ పెద్దగా సినిమాలు చేయలేదు. మధ్యలో 'టక్ జగదీష్' చేశారు. అది ఓటీటీలో విడుదలైంది. దానికి ముందు తమిళ సినిమాలు చేశారు. ఇప్పుడీ సినిమాతో థియేటర్లలోకి వస్తున్నారు. తెలుగులో 'పెళ్లి చూపులు' తర్వాత  అటువంటి పాత్రలు, కథలు రాకపోవడం వల్ల విరామం వచ్చిందని రీతూ వర్మ తెలిపారు. ప్రస్తుతం హీరో శర్వానంద్ చేస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా సినిమా, ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాని ఆమె చెప్పారు.