రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం 3.25 గంటలకు ఆయన చనిపోయినట్లుగా ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి.


కృష్ణం రాజు కడసారి చూసిన ప్రభాస్
కృష్ణం రాజు (Krishnam Raju) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం చేర్పించారు. చికిత్స తీసుకుంటున్న ఆయన్ను చూడటానికి ప్రభాస్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. పెదనాన్నను కడసారి చివరి చూపు చూసుకున్నారు. ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లాడని తెలిసిన ఫ్యాన్స్‌కు టెన్షన్ మొదలైంది. తొలుత ఆయనకు ఏమైందని ఆందోళన చెందారు. ఆ తర్వాత కృష్ణం రాజుకు బాలేదని తెలిసిన తర్వాత మరో టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
 
వయోభారంతో కృష్ణం రాజుకు ఆరోగ్య సమస్యలు... 
కృష్ణం రాజు వయసు 83 ఏళ్ళు. వయోభారం వల్ల వచ్చిన అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల నుంచి ఆయనకు సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా సమయంలో కూడా రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు కూడా వచ్చాయి. 


విజయనగర సామ్రాజ్య రాజవంశస్తులు


పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు.


అవే కళ్లు అనే చిత్రం ద్వారా విలన్ గా కూడా కృష్ణంరాజు నటించారు.  1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.


రాధే శ్యామ్ చివరి సినిమా


'రాధే శ్యామ్'లో తన తమ్ముడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్‌తో కలిసి కృష్ణం రాజు నటించారు. ఆ సినిమాలో కూడా కేవలం ప్రభాస్ కోసమే నటించారు. నటుడిగా ఆయన చివరి సినిమా 'రాధే శ్యామ్'.


రాజకీయాల్లోకి ఎంట్రీ, కేంద్ర మంత్రిగా..
కృష్ణంరాజు తొలుత 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 1998లో 13వ లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 1999 మధ్యంతర ఎన్నికలు రావడంతో అప్పుడు కూడా నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. అలా కేంద్రంలోని అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి బీజేపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో ఓటమి చెందారు. మార్చి 2009లో బీజేపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.