మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తాజాగా ‘RC 15’  అనే సినిమా రూపొందుతున్నది. భారీ బడ్జెట్ ‏తో పాన్ ఇండియా రేంజ్‏లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  ప్రముఖ దర్శకుడు దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు  షూటింగ్ కొనసాగుతోంది. తొలి షెడ్యూల్ పుణె, స‌తారా, పాల్‌ట‌న్ సహా పలు లొకేషన్లలో స్పెషల్ సీన్లను తెరకెక్కించారు.


కీలక పాత్రలో ఎస్జే సూర్య


తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ మూవీలో తమిళ స్టార్​ డైరెక్టర్​, నటుడు ఎస్​ జే సూర్య నటిస్తున్నట్లు వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో ఆయన సైకో విలన్​గా  కనిపించనున్నట్లు తెలుస్తున్నది. గత కొద్ది రోజులగా ఈ సినిమా గురించి ఆయనతో చర్చలు జరుపగా తాజాగా అంగీకరించారట.  ఎస్​ జే సూర్య ఇప్పటికే పలు  సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసి మెప్పించారు.  మహేశ్​బాబు 'స్పైడర్'​, విజయ్​ 'అదిరింది' సహా పలు చిత్రల్లో విలన్ గా చేశారు. తాజాగా ఆయన నటించిన 'మానాడు' సినిమా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది.  అటు ‘RC 15’ లో రాం చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడట. ఒకటి ఆఫీసర్ క్యారెక్టర్, మరొకటి సాధారణ యువకుడి పాత్ర పోషిస్తున్నాడట. అయితే, ఈ ప్రాజెక్ట్‌లోకి ఎస్.జే. సూర్య ఎంట్రీ రామ్ చరణ్ అభిమానులను కలవరపరుస్తోంది. ఇందుకు కారణం.. సూర్య గతంలో పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన ‘కొమరం పులి’, అలాగే ఆయన మహేష్ బాబుతో కలిసి నటించిన ‘స్పైడర్’ మూవీలు అట్టర్ ఫ్లాప్ కావడమే. దీంతో సూర్య మన తెలుగు హీరోలకు కలిసి వస్తాడా అనే సందేహం నెలకొంది. మరి, ఆ సందేహాన్ని దర్శకుడు శంకర్-రామ్ చరణ్‌లు బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. 





రూ. 40 కోట్లతో భారీ సెట్


ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.  రాం చరణ్, కియారా అద్వానీకి సంబంధించి పలు రొమాంటిక్ సీన్స్ షూట్ చేశారు. వీటి కోసం ఓ భారీ సెట్ వేశారట. ఆ సెట్ కోసం దాదాపు రూ. 40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రజనీ కాంత్ శివాజి సినిమాలో సెట్ మాదిరిగా నిర్మించారట.  ఈ పాట అద్భుతంగా తెరకెక్కినట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో ఈ పాట అత్యంత కీలకంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.


Also Read : 'కెప్టెన్' సినిమా రివ్యూ : ఆర్య గురి తప్పిందా? బావుందా?



Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?